మానవాళి ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న కరోనా వైరస్, తలకిందులైన ప్రపంచ దేశాల ఆర్ధికపరిస్థితి
చైనావాడు ఏ దుర్ముహూర్తాన కరోనా వైరస్ను పుట్టించాడో కానీ... అది మనల్ని వదిలి వెళ్లడం లేదు. రోజురోజుకీ మరింత పెరుగుతూ దడ పుట్టిస్తోంది..
చైనావాడు ఏ దుర్ముహూర్తాన కరోనా వైరస్ను పుట్టించాడో కానీ… అది మనల్ని వదిలి వెళ్లడం లేదు. రోజురోజుకీ మరింత పెరుగుతూ దడ పుట్టిస్తోంది.. సుమారు ఏడాది కిందట పుట్టిన ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది.. తలరాతలు తలకిందులు చేసేసింది.. అగ్రరాజ్యం అమెరికానే హహాకారాలు చేస్తున్నదంటే మామూలు దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో..! ఇప్పటికే 13 లక్షల మందికిపైగా ఆ మహమ్మారి బలి తీసుకుంది.. ఇంకా ఆ వైరస్ దాహం తీరలేదు.. సరే.. ఆ వైరస్ నుంచి ఎలాగోలా కోలుకున్నవారినైనా నిశ్చితంగా ఉండనిస్తుందా అంటే అదీ లేదు.. కోలుకున్నవారిలో కొంతమందికి దీర్ఘకాలం అనారోగ్య సమస్యలు ఎదురవుతాయట! వైరస్ కారణంగా వచ్చే జబ్బులు ఇప్పట్లో తగ్గవట! ఇలాగని ఇటీవల నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని అనుకుంటున్నాం కానీ అది సమస్త అవయవాలపై ప్రభావం చూపిస్తోంది.. మెదడు, గుండెలను కూడా అది నాశనం చేస్తున్నది. అసలు కరోనానే ఓ మిస్టరీ అని అంటున్నారు నిపుణులు. వైరస్ నుంచి కోలుకున్నవారికి రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతున్నది. ఏదో తెలియని అనాసక్తి.. నిస్సత్తువ ఆవరిస్తుందట! తలనొప్పి, గుండె, శ్వాస సమస్యలు జీవితాంతం వెంటాడుతాయట! కొందరికి కండరాల నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని అంటున్నారు మేయో క్లినిక్కు చెందిన సైంటిస్ట్ గ్రెగరీ పోలాండ్..కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి గుండె ఎక్స్రేలను చూస్తే కండరాలు దెబ్బతిన్నట్టు స్పష్టమయ్యిందని చెబుతున్నారు. అంతేనా రక్తం కూడా పాడవుతుందట! రక్తంలో చిన్నపాటి ముద్దలు ఏర్పడుతాయని, వాటివల్ల గుండెకు వెళ్లే చిన్నచిన్న ధమనులు మూసుకుపోతాయని అంటున్నారు. అయితే కరోనా వైరస్ నుంచి కోలుకున్న అందరిలోనూ ఇవే లక్షణాలు కనిపించడం లేదు.. కొందరిలో మాత్రమే కనిపిస్తున్నాయి.. ఇదొక్కటే కాసింత ఊరటనిచ్చే అంశం. ఇక మనిషి సగటు ఆయు ప్రమాణం కూడా కరోనా కారణంగా తగ్గిందట! అమెరికా, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలు, యూరప్ దేశాలలో కొత్తగా పుట్టబోయే వారి ఆయుష్షు ఏడాది వరకూ తగ్గనుందని చెబుతున్నారు షాంఘై యూనివర్సిటీ వారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలసిస్, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా సైంటిస్టులతో కలిసి జరిపిన అధ్యయనం ఈ విషయాన్ని చెబుతోంది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశాలలో ఆయుష్షు మూడు నుంచి ఎనిమిదేళ్ల వరకు తగ్గవచ్చంటున్నారు నిపుణులు. ఆరోగ్యం సంగతి అలా ఉంచితే కరోనా వైరస్ పేదలను నిరుపేదలుగా మార్చింది.. ఇప్పుడు దారిద్ర్యంతో బతుకుతున్నవారు 11.5 కోట్ల మంది ఉంటే వచ్చే ఏడాది చివరికల్లా ఈ సంఖ్య 15 కోట్లకు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. మొత్తంగా కరోనా వైరస్ ప్రపంచగతినే పూర్తిగా మార్చేసింది.. ఇంకెన్ని ప్రమాదాలు సృష్టించబోతున్నదో చూడాలి..