గ్రేటర్ పై కాంగ్రెస్ గురి.. అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు.. ఇవాళ 50 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలుకావడంతో అన్ని పార్టీలు వ్యుహప్రతివ్యుహాలకు పదునుపెడుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలుకావడంతో అన్ని పార్టీలు వ్యుహప్రతివ్యుహాలకు పదునుపెడుతున్నాయి. వరుస ఎన్నికల్లో చతికిలాపడ్డ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో పరువునిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. కనీసం 50 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులను ఈ సాయంత్రానికల్లా తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
గ్రేటర్ ఎన్నికలపై రాష్ట్ర కాంగ్రెస్ ముమ్మర కసరత్తు మొదలుపెట్టింది. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని సమర్థంగా ఎదుర్కొనేందుకు సీనియర్లకు బాధ్యతలు అప్పగించింది. మంగళవారం నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి పలు కమిటీలను నియమించారు. గురువారం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు బి-ఫారాలు అందించనున్నారు. 21న మేనిఫెస్టో విడుదల చేసి అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు రెఢీ అవుతోంది.
బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండటంతో సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్ పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల కమిటీలు మంగళవారం రాత్రి గాంధీభవన్లో విడివిడిగా సమావేశమయ్యాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు గీతారెడ్డి, షబ్బీర్అలీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, కమిటీల సభ్యులు హాజరయ్యారు. వీరందరూ తమ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని మున్సిపల్ డివిజన్ల నుంచి వచ్చిన ఆశావహుల దరఖాస్తులను పరిశీలించారు. వారి పూర్వ, వ్యక్తిగత వివరాలతో పాటు స్థానికంగా ప్రజలతో ఉన్న సత్సంబంధాలు, గెలుపు అవకాశాలపై చర్చించినట్లు సమాచారం. మాజీ కార్పొరేటర్లు, పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి కనబరిచే వారికి, అనుబంధ సంఘాలు, మహిళా కాంగ్రెస్లో క్రియాశీలకంగా పని చేస్తున్న వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పీసీసీ భావిస్తోంది.
ముఖ్యంగా ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం టికెట్లు ఇస్తామని ప్రకటించినందున.. నాయకుల భార్యలకు కాకుండా పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న వారికే ఇవ్వాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. 150 డివిజన్లకు గాను 300 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో దాదాపు 50 డివిజన్ల వరకు అభ్యర్థులపై ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చింది పీసీసీ. ఈ జాబితాను బుధవారం పీసీసీకి అందజేసి.. సాయంత్రం వరకు 50 మందితో తొలి జాబితా ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చారు. మిగతా డివిజన్లకు సంబంధించి గురువారం మధ్యాహ్నం వరకు అభ్యర్థులను ప్రకటించడానికి కసరత్తు జరుగుతుందని ముఖ్య నాయకుడొకరు తెలిపారు.
అలాగే, స్థానికి సమస్య పరిష్కారాని అదిక ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాన మేనిఫెస్టోతో పాటు డివిజన్ల వారీగా కూడా స్థానిక అంశాలపై డివిజన్ మేనిఫెస్టో తయారు చేయాలని పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ సూచించారు. మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి ఛైర్మన్గా, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కన్వీనర్గా మేనిఫెస్టో కమిటీని ఏర్పాటుచేశారు. ఈనెల 21న జీహెచ్ఎంసీ మేనిఫెస్టో విడుదల చేస్తామని మంగళవారం పీసీసీ ప్రకటించింది.
కాగా, జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్ పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, ఫిరోజ్ఖాన్, జాఫర్ జావేద్, జి.నిరంజన్, షేక్అబ్దుల్లా సొహైల్. సికింద్రాబాద్: వి.హనుమంతరావు, మర్రి శశిధర్రెడ్డి, ఎం.అంజన్కుమార్ యాదవ్, పి.విష్ణువర్ధన్రెడ్డి, దాసోజు శ్రవణ్, ఆదం సంతోష్ కుమార్. చేవెళ్ల: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మహ్మద్ అజారుద్దీన్, చల్లా నర్సింహారెడ్డి, ఎం.భిక్షపతి యాదవ్, రాచమల్ల సిద్దేశ్వర్, దీప భాస్కర్రెడ్డి. మల్కాజిగిరి: రేవంత్రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, చల్లా నర్సింహారెడ్డి, నందికంటి శ్రీధర్, బుడే సాబ్. మెదక్: దామోదర రాజనర్సింహ, విజయశాంతి, జె.గీతారెడ్డి, టి.జగ్గారెడ్డి, గాలి అనిల్కుమార్.
ఈ కమిటీలను సమన్వయం చేసేందుకు పీసీసీ సమన్వయకర్తలను నియమించారు.
హైదరాబాద్ పార్లమెంట్కు మాజీ మంత్రి షబ్బీర్అలీ, సికింద్రాబాద్కు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మల్కాజిగిరికి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, చేవెళ్లకు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, మెదక్కు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్లకు బాధ్యతలు అప్పగించారు.