Terrorist Activities: ఈ ఏడాది జమ్మూలో తగ్గిన ఉగ్రవాద కార్యకలాపాలు.. 225 మందిని మట్టుబెట్టాం: డీజీపీ
Terrorist Activities: జమ్మూకశ్మీర్.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఉగ్రవాదుల కదలికలు. జమ్మూకశ్మీర్లో ఏదో ఒక ప్రాంతంలో...
Terrorist Activities: జమ్మూకశ్మీర్.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఉగ్రవాదుల కదలికలు. జమ్మూకశ్మీర్లో ఏదో ఒక ప్రాంతంలో ఉగ్రవాద కాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో అధికంగా జరిగే ఉగ్ర దాడులను భారత భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. అయితే గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది ఉగ్రవాద కార్యకలాపాలు చాలా తక్కువ అని ఆ రాష్ట్ర డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. గురువారం డీపీజీ మీడియాతో మాట్లాడుతూ.. 2018, 2019 సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది ఉగ్రవాద సంబంధిత ఘటనలు కశ్మీర్లో తగ్గినట్లు వివరించారు.
ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్నవారి సంఖ్య మాత్రం పెరిగినట్లు ఆయన వెల్లడించారు. అయితే 2019 సంవత్సరంతో పోలిస్తే ఇది ఎక్కువగా ఉందన్నారు. ఇందులో 70 శాతం మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు. ఉగ్రవాదుల జీవిత కాలం తగ్గిపోతున్నట్లు చెప్పారు. కోవిడ్ 19 వల్ల ఇప్పటి వరకు రాష్ట్రంలో 15 మంది పోలీసులు మరణించారని, రాష్ట్రంలో సుమారు 3,500 మంది పోలీసులకు కరోనా సోకినట్లు పేర్కొన్నారు.
శతృదేశమైన పాక్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. గత నాలుగేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది చొరబాట్లు చాలా తగ్గాయన్నారు. అందుకే ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేసే ప్రయత్నం చేశారని డీజీపీ తెలిపారు. జమ్మూ ప్రాంతంలో డజన్ల కొద్ది ఉగ్రవాదులు ఉండేవారని, ఇప్పుడా సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని వివరించారు. ఈ ఏడాది జమ్మూకశ్మీర్లో 100కుపైగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నమోదు కాగా, వాటిల్లో 225 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు.