భారత్-చైనా సరిహద్దులో టెన్షన్ !
త కొంత కాలంగా చర్చల పేరుతో సైలెంట్ గా వున్న చైనా మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆగస్టు 29 ఘటన నేపథ్యంలో భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. చైనాకు తగిన రీతిలో బదులిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించారు.
గత కొంత కాలంగా చర్చల పేరుతో సైలెంట్ గా వున్న చైనా మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతోంది. లద్దాక్ లోని వాస్తవాధీన రేఖ దగ్గర యథాతథ స్థితిని ఉల్లంఘిస్తూ దురాక్రమణకు పాల్పడుతోంది. ఆగస్టు 29 ఘటన నేపథ్యంలో భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి.
సరిహద్దుల్లో దురాక్రమణను అడ్డుకోవడంలో భారత జవాన్లు, కేంద్ర ప్రభుత్వం వ్యవసరిస్తున్న తీరుతో ఖంగు తిన్న చైనా కాళ్ల బేరానికి వస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి రక్షణ మంత్రి స్థాయిలో చర్చలు జరుపుదామంటూ చైనా ప్రతిపాదిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మూడు సార్లు ప్రతిపాదనలను పంపింది.
అయితే డ్రాగన్ కంట్రీ దొంగబుద్ధిని ఇప్పటికే కనిపెట్టిన భారత ప్రభుత్వం..ఈ చర్చలకు ఇంతవరకూ సుముఖత వ్యక్తం చేయలేదు. సరిహద్దుల్లో యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నందువల్లనే లద్దాఖ్లో ఉద్రిక్తత కొనసాగుతోందని భారత ప్రభుత్వం చెబుతోంది. చైనా పూర్తిగా వెనక్కి తగ్గితే తప్ప చర్చల విషయంలో ముందుకు వెళ్లలేమంటోంది. ప్రస్తుతానికి మిలటరీ లెవల్ చర్చలకే కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది.
పాంగాంగ్లో చైనా దుస్సాహసం నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే లద్దాఖ్లో పర్యటిస్తున్నారు. చైనా కవ్వింపు చర్యలతో సరిహద్దులో సైనిక బలగాలను భారీగా మోహరిస్తోంది. రాత్రిపూట తూర్పు లద్దాఖ్లోని గగనతలంలో పెట్రోలింగ్ చేస్తున్న వాయుసేన బలగాలు.. ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చైనాకు హెచ్చరికలు పంపాయి. చైనాతో 3,400 కిలోమీటర్ల సరిహద్దులోని కీలక ప్రాంతాల్లో ఆర్మీ, వాయుసేన బలగాలు హైఅలర్ట్గా ఉండాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు తగిన రీతిలో బదులిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. డ్రాగన్ దేశం ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగినా దానికి తగిన బుద్ధి చెప్పేందుకు మన సైన్యం సన్నద్ధంగా ఉందని చెప్పారు. తూర్పు లద్దాఖ్లోని కొన్నిప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా తెగబడిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ దుస్సాహసానికి దిగితే ఆ దేశం తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. రెండు దేశాలను ఒకేసారి ఎదుర్కోనే సామర్థ్యం భారత సైన్యానికి ఉందని రావత్ అన్నారు.
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ కూడా చైనా ఆగడాలను మీడియా సమావేశంలో ఎండగట్టారు. ద్వైపాక్షిక ఒప్పందాలను, ప్రొటోకాల్ను చైనా ఉల్లంఘించడం వల్లనే సరిహద్దులో దాదాపు మూడు దశాబ్దాలుగా ఉద్రిక్తత నెలకొందన్నారు. ఒప్పందాలను గౌరవించి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని చైనాను కోరారు. శాంతియుత చర్చలతో అన్ని అంశాలను పరిష్కరించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు.
ఇండియా-చైనా టెన్షన్ మధ్య భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ షాంఘై సహకార సంస్థ సమావేశంలో పాల్గొనడానికి రష్యాకు వెళ్లారు. సరిహద్దుల్లో చైనా వ్యవహరిస్తున్న తీరును పుతిన్ సర్కార్కు వివరించారు. ఈ విషయంలో భారతదేశానికి తమ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని రష్యా ప్రభుత్వం ప్రకటించింది.
ఇవాళ జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్నాథ్తో పాటు చైనా రక్షణ మంత్రి కూడా పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 10 న జరిగే ఎస్ సీవో విదేశాంగ మంత్రుల సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ను ఆహ్వానించింది. రష్యా రక్షణ మంత్రి షోయిగుతో తన ద్వైపాక్షిక సమావేశంలో, రక్షణ ఒప్పందాల ప్రకారం భారత సాయుధ దళాలకు ఆయుధాల సరఫరా చేయడంపై చర్చించనున్నారు. ఇప్పటికే AK-47.. 203 మోడల్ రైఫిల్స్ తయారీపై క్లారిటీ రావడంతో.. ఇక S-400 క్షిపణి వ్యవస్థను త్వరగా అందించడంపై చర్చలు జరపనున్నారు.