ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది రాజ్యసభ సభ్యుల ఏకగ్రీవం
ఉత్తరప్రదేశ్కి చెందిన 10 మంది అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 10 స్థానాల్లో బీజేపీకి చెందిన ఎనిమిది మంది, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన చెరొక్క అభ్యర్థి విజయం సాధించారు.
ఉత్తరప్రదేశ్కి చెందిన 10 మంది అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 10 స్థానాల్లో బీజేపీకి చెందిన ఎనిమిది మంది, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన చెరొక్క అభ్యర్థి విజయం సాధించారు. సోమవారం రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సోమవారం నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన 10 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. అయితే, వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు, రిటర్నింగ్ అధికారి కుట్రకు తాను బలయ్యానని, తనకు న్యాయం జరిగేంత వరకు ఫలితాలను నిలుపుదల చేయాలని స్వతంత్ర అభ్యర్థి ప్రకాశ్ బజాజ్.. ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు అనూహ్య మలుపు తిరిగాయి. సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన వారణాసికి చెందిన న్యాయవాది ప్రకాశ్ బజాజ్ నామినేషన్ను అధికారులు సాంకేతిక కారణాలతో తిరస్కరించడంతో.. మొత్తం 10 స్థానాలకు ఎన్నికలు జరుపాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో 10 స్థానాల్లో బీజేపీకి ఎనిమిది, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీకి చెరొక్కటి లభించాయి. ఎన్నికైన బీజేపీ అభ్యర్థులలో కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరితోపాటు అరుణ్ సింగ్, హరిద్వార్ దుబే, బ్రిజ్ లాల్, నీరజ్ శేఖర్, గీతా శాక్య, సీమా ద్వివేది, బీఎల్ వర్మ ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ నుంచి ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నుంచి రామ్జీ గౌతమ్ కూడా పెద్దల సభకు ఎన్నికయ్యారు.
అయితే, బీఎస్పీకి చెందిన రాంజీ గౌతమ్, ఎస్పీ మద్దతుతో బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి ప్రకాష్ బజాజ్ మధ్య పదో సీటు కోసం హై డ్రామా నడిచింది. చివరకు ప్రకాశ్ బజాజ్ నామినేషన్ను సాంకేతిక పరిశీలనలో రద్దు చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. దీంతో బీఎస్పి అభ్యర్థి రామ్జీ గౌతమ్.. తన పార్టీకి పది ఓట్లు మాత్రమే ఉన్నప్పటికీ విజయం సాధించారు. తన నామినేషన్ను సాంకేతిక పరిశీలనలో రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రకాశ్ బజాజ్.. భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.