నిజామాబాద్లో మరో10 కరోనా కేసులు నమోదు.. మొత్తం 39 పాజిటివ్ కేసులు..
కోవిద్ 19 దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడించారు.
కోవిద్ 19 దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 39కి చేరింది. కరోనాపై నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో మంత్రి వివరాలు వెల్లడించారు. వీటిలో నిజామాబాద్ నగరంలో 21 కేసులు, ఇతర ప్రాంతాల్లో 18 పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంత్రి తెలిపారు.
కాగా.. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 3,800 మందిలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదని మంత్రి స్పష్టం చేశారు. కేవలం ఢిల్లీ మర్కజ్ వెళ్లొచ్చిన వారిలోనే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చెప్పారు. జిల్లాలో ఇంకా 109 నమూనాల నివేదికలు రావాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల ఆధారంగా కరోనా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా తీసుకుని చర్యలు చేపడుతున్నామని.. ఇప్పటివరకు జిల్లాలో 4 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రెండు రోజులకు ఒకసారి ప్రతి ఇంటిని సర్వే చేసేలా అధికారులను ఆదేశించినట్లు మంత్రి వేముల వెల్లడించారు.