భక్తులకు ముఖ్య గమనికః దర్శనాలకు అనుమతి
ప్రస్తుతం లాక్డౌన్ -3 ముగుస్తున్న నేపథ్యంలో తిరిగి ఆలయాల్లో భక్తులకు దర్శనాలు కల్పించే దిశాగా ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు దేవాదాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని అన్ని ఆలయాలు మూతపడ్డాయి. దాదాపు రెండు నెలలుగా భక్తులకు భగవత్ దర్శనాలు కరువైపోయాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు షిర్డీ, శ్రీశైలం వంటి ప్రముఖ ఆలయాలన్నీమూసివేశారు ఆలయ అధికారులు. అయితే, ప్రస్తుతం లాక్డౌన్ -3 ముగుస్తున్న నేపథ్యంలో తిరిగి ఆలయాల్లో భక్తులకు దర్శనాలు కల్పించే దిశాగా ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు దేవాదాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో కొలువైన శ్రీకాళహస్తీశ్వరాలయం లాక్డౌన్ తర్వాత తెరుచుకోనుంది. ఆలయంలో దర్శనాల కోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయంలో భక్తులు నిలబడేందుకు మార్కింగ్ రింగ్స్ ఏర్పాటు చేశారు. లాక్డౌన్ నుంచి మినహాయింపు రాగానే, భక్తులను ఆలయంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి. ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించేందుకు ధర్మల్ గన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అందరూ మాస్క్ లు ధరించి రావాలని, శానిటైజర్లతో ప్రత్యేక స్టాండ్లు కూడా ఉంటాయని చెప్పారు. ఆలయంలోకి వచ్చే భక్తులను ముందుగా డిజిన్ఫెక్షన్ టన్నెల్ లోకి పంపిస్తామని తెలిపారు. రాహుకేతు పూజలకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, ఒక పూజా టికెట్ కు ఒక పీట, ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఇక కాణిపాకం మహాగణపతి ఆలయంలోనూ అధికారులు భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో భక్తులు వేచి ఉండడానికి కనీసం వ్యక్తికి వ్యక్తికి మధ్య మీటర్ దూరం ఉండేలా రింగులు గీసి ఉంచారు. ఆలయంలోకి వచ్చే భక్తులు ముఖాలకు మాస్క్ పెట్టుకోవడం, చేతులకు హ్యాండ్ శానిటైజర్ రాసుకోవడం, క్యూలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడం, అలాగే పూజలు, ప్రసాదాలు, అన్నదానం ఇతరత్రా అంశాలపై విధి విధానాలను తయారు చేస్తున్నారు. ప్రభుత్వం భక్తులకు అనుమతించాక..రోజూ పరిమిత సంఖ్యలో దర్శనాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు సోషల్ డిస్టాన్స్ గుర్తుంచుకునేలా… ప్రత్యేక బాక్సులపై పెయింటింగ్ వేసి అక్కడక్కడా ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నారు అధికారులు. ఈనెల 17 తర్వాత లాక్ డౌన్ పొడిగించకుండా ఉంటే..ప్రభుత్వం ఆదేశాలు వచ్చిన అనంతరం దర్శనాలకు అనుమతిస్తామని వారు స్పష్టం చేశారు. మరోవైపు మే 14వ తేదీన జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ క్షేత్రాన్ని కూడా ఓపెన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక మే 15వ తేదీన బద్రీనాథ్ టెంపుల్ను తెరుస్తామని చెప్పారు. నిజానికి ఏప్రిల్ 29 కేదారినాథ్, 30న బద్రీనాథ్ ఆలయాలను తెరవాల్సి ఉంది. కానీ ప్రధాన పూజారులు బయటి రాష్ట్రాల్లో ఉండడం వల్ల.. స్థానికంగా ఉన్న వారి అసిస్టెంట్లకు ఆలయాలు తెరిచే అవకాశం ఇచ్చారు. అయితే సాధారణ భక్తులకు మాత్రం ఆలయాలు తెరిచే తేదీలను కొత్తగా ప్రకటించారు. దాని ప్రకారం మే 14న కేదారినాథ్, 15న బద్రీనాథ్ ఆలయాలను తెరవనున్నారు.