#COVID19 క్వారెంటైన్ ముగిసినా కొంపకు పంపట్లే… ఢిల్లీలో ‘తెలుగోడు’
వారంతా అమెరికా నుంచి ఇండియా చేరారు. అక్కడ్నించి నేరుగా హైదరాబాద్ చేరుకోవాలి. కానీ.. దేశంలో కరోనా కలకలం వారిని ఢిల్లీలోనే ఆగిపోయేలా చేసింది. క్వారెంటైనే కదా.. వుండిపోదామనుకున్న తెలుగు వారికి ఆ పీరియడ్ ముగిసినా మోక్షం దొరకడం లేదు.
Telugu people trouble in New Delhi: వారంతా అమెరికా నుంచి ఇండియా చేరారు. అక్కడ్నించి నేరుగా హైదరాబాద్ చేరుకోవాలి. కానీ.. దేశంలో కరోనా కలకలం వారిని ఢిల్లీలోనే ఆగిపోయేలా చేసింది. క్వారెంటైనే కదా.. వుండిపోదామనుకున్న తెలుగు వారికి ఆ పీరియడ్ ముగిసినా మోక్షం దొరకడం లేదు. దాంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకునే దారేది? అంటూ వాపోతున్నారు అమెరికా నుంచి వచ్చిన దేశరాజధానిలో చిక్కుకుపోయిన తెలుగు వారు. వివరాల్లోకి వెళితే..
చికాగో నుంచి హైదరాబాద్కు మార్చి 20వ తేదీన బయలుదేరిన పలువురు ఢిల్లీలో ఇరుక్కుపోయారు. అమెరికా నుంచి తిరిగొస్తూ ఢిల్లీలో చిక్కుకుపోయారు తెలుగువారు. లాక్డౌన్ ప్రకటనతో వారిని అర్థాంతరంగా దింపేశారు ఎయిరిండియా సిబ్బంది. 20న చికాగోలో బయల్దేరి 21న ఢిల్లీ చేరుకున్న ఎయిరిండియా విమానంలో వచ్చిన తెలుగు వారిని ఢిల్లీలో క్వారెంటైన్ సెంటర్కు తరలించారు. కరోనా ఎఫెక్టుతో అమెరికా అతలాకుతలం అవుతున్న తరుణంలో అక్కడ్నించి వచ్చిన ప్రయాణికులకు నేరుగా వారి ఇళ్ళకు పంపిస్తే కరోనా వ్యాపిస్తుందన్న భయంతో వారందరినీ పద్నాలుగు రోజుల క్వారెంటైన్కు తరలించారు.
ఇక్కడి వరకు బాగానేవున్నా.. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. మార్చి 22 నుంచి పద్నాలుగు రోజుల క్వారెంటైన్ అంటే ఏప్రిల్ 4వ తేదీన ముగిసింది. ఆ తర్వాతైనా తమను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్ళేందుకు అనుమతిస్తారని వారంతా భావించారు. కానీ క్వారెంటైన్ పీరియడ్ ముగిసిన తర్వాత కూడా అధికారులు ఎవరు తమకు పట్టించుకోకపోవడంతో తెలుగు వారు ఢిల్లీలో ఇబ్బందుల పాలవుతున్నారు. క్వారెంటైన్ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో తామంతా నెగెటివ్గా తేలిందని వారంటున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎటూ కదల్లేకపోతున్నామని, తమకు హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని వారు బతిమాలుకుంటున్నారు.