#COVID19 ఎయిర్పోర్టుల్లో మనోళ్ళు.. దేశం చేరే దారేది?
కరోనా ప్రభావంతో అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు కొనసాగుతుండడంతో వందలాది మంది తెలుగు వారు పలు విదేశీ ఎయిర్పోర్టుల్లో మగ్గుతున్నారు. అత్యధికంగా కజికిస్తాన్లో ఎక్కువ మంది భారతీయులు... ముఖ్యంగా తెలుగు వారు...
Hundreds of Telugu people stuck in many international airports: కరోనా ప్రభావంతో అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు కొనసాగుతుండడంతో వందలాది మంది తెలుగు వారు పలు విదేశీ ఎయిర్పోర్టుల్లో మగ్గుతున్నారు. అత్యధికంగా కజికిస్తాన్లో ఎక్కువ మంది భారతీయులు… ముఖ్యంగా తెలుగు వారు పడిగాపులు కాస్తున్నట్లు ఎపీ ఎన్నార్టీ సెంటర్కు సమాచారం అందింది. ఫిలిప్పిన్స్, ఇటలీ, మలేషియా వంటి దేశాలలో ఎక్కువ సంఖ్యలో తెలుగు వారు పడిగాపులు కాస్తున్నట్లు తెలుస్తోంది.
కరోనా ఎఫెక్ట్తో అనేక దేశాల విమానాశ్రయాల్లో చిక్కుకున్న తెలుగు వారు ఎపీ ఎన్నార్టీ సెంటర్కు కాల్ చేసి సమాచారం అందిస్తున్నారు. అత్యధికంగా కజకిస్థాన్ విమానాశ్రయంలో 100 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయారు. ఫిలిప్పీన్స్లో 80 మంది, ఇటలీలో 49 మంది, మలేషియాలో40 మంది, యుకేలో 25 మంది, అమెరికాలో అయిదుగురు, ఆస్ట్రేలియాలో ముగ్గురు ఎయిర్పోర్టుల్లో ఇరుక్కుపోయామని ఎపీ ఎన్నార్టీ సెంటర్కు ఇన్ఫర్మేషన్ అందించారు.
ఇంకా అనేక మంది ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయి వుండొచ్చని ఏపీ ఎన్నార్టీ సెంటర్ అధికారులు చెబుతున్నారు. ఎన్నార్టీ కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తే.. తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడ వున్నా, వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ప్రస్తుతం కాంటాక్ట్ చేసిన వారిని ఇండియాకు రప్పించేందుకు ఎన్నార్టీ అధికారులు, ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.