YSRTP Deeksha: వనపర్తి జిల్లాలో వైఎస్సార్టీపీ నిరుద్యోగ దీక్ష.. ఉద్యోగాల భర్తీ పూర్తి చేసే వరకు పోరాటంః షర్మిల
తెలంగాణ పాలకులపై మరోసారి మండిపడ్డారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా ఉంటానన్న ఆమె.. ఉద్యోగాల భర్తీ కోసం పోరాటం చేస్తానన్నారు.
YSRTP Unemployment Strike in Wanaparthy: తెలంగాణ పాలకులపై మరోసారి మండిపడ్డారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా ఉంటానన్న ఆమె.. ఉద్యోగాల భర్తీ కోసం పోరాటం చేస్తానన్నారు. మంగళవారాన్ని నిరుద్యోగదినంగా ప్రకటించి.. ఇందులో భాగంగా ఇవాళ వనపర్తి జిల్లాలో నిరాహారదీక్ష చేపట్టారు.
తెలంగాణలో నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరాహరదీక్ష చేపట్టారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం తాటిపర్తి గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు నిరాహారదీక్ష కొనసాగించారు. దీక్షలో కూర్చునే ముందు నిరుద్యోగ సమస్యతో ప్రాణాలు తీసుకున్న కొండల్ ఇంటికి వెళ్లి…తల్లిదండ్రుల్ని పరామర్శించారు షర్మిల. వారికి తన సానుభూతి ప్రకటించారు.
కొండల్ ఇంటి నుంచి వైఎస్ షర్మిల దీక్షాస్థలికి చేరుకున్నారు. నిరాహారదీక్షకు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో కదలివచ్చారు. దీక్షకు మద్దతు తెలిపారు. ఉద్యోగాల భర్తీ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరీని తప్పు పట్టారు వైఎస్ షర్మిల. ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయకుండా.. నోటిఫికేషన్లు అంటూ ప్రకటనలకే పరిమితమయ్యారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50 వేల మందిని ఉద్యోగాల్లోంచి పీకేశారని షర్మిల ఆరోపించారు.
రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా చేయాలన్నదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాటం లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగ దినంగా పాటిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ వనపర్తిలో నిరాహారదీక్ష చేపట్టిన షర్మిల.. నిరుద్యోగత యువతకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. YSRTP అధికారంలోకి వస్తే విభజించిన కొత్త జిల్లాల ప్రతిపాదికన ఉద్యోగ నియామకాలు చేపడతామని మాటిచ్చారు.