Congress-BJP: హన్మకొండలో బీజేపీ- కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. పోలీసులపై విమర్శలు
ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. అడ్డొచ్చిన పోలీసులను కూడా కొట్టారు. అలాగని వ్యక్తిగత కక్ష్యలేమీ లేవు. కేవలం పార్టీ గొడవలే. వరంగల్లో బీజేపీ - కాంగ్రెస్ మధ్య పెద్ద సమరమే జరిగింది. కాంగ్రెస్ చేపట్టిన అగ్నిపథ్ నిరసనలు కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది.
హనుమకొండలో బీజేపీ – కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ – కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుపడటంతో.. ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమవడమే కాకుండా.. పోలీసులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. విభజన హామీలు అమలుపర్చడంతో పాటు, అగ్నిపథ్ ఉప సంహరించుకున్న తర్వాతే ప్రధాని మోడీ తెలంగాణలో అడుగుపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో హనుమకొండ హంటర్ రోడ్డులోని బీజేపీ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు.
సరిగ్గా అదే సమయానికి బీజేపీ ఆఫీస్లో కార్యవర్గ సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు ఆఫీసు దగ్గరకు చేరుకోగానే.. బీజేపీ కార్యకర్తలంతా బయటకు వచ్చారు. దీంతో పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఇటు వైపు, అటు వైపు పదుల సంఖ్యలో కార్యకర్తలు ఒకేసారి రోడ్డు మీదకు వచ్చి కొట్టుకున్నారు. ఒక్కసారిగా యుద్ధ వాతావరణం ఏర్పడింది. వాళ్లను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. చివరకు పోలీసులపైనా కొందరు కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో సుబేదారి పోలీస్ స్టేషన్ సీఐ గన్మెన్ అనిల్ తలకు గాయాలయ్యాయి. సీఐ దయాకర్ చేతికి దెబ్బలు తగిలాయి. గన్మెన్ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. నగరమంతా పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. అల్లర్లకు పాల్పడిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని పోలీసులు హెచ్చరించారు. అందరినీ అరెస్ట్ చేసి.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.