దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ.. ఆన్లైన్లో ఈనెల 25నుంచి ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేస్తుందని షెడ్యూల్డ్ కులాల..
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేస్తుందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. వీటి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) దివ్యాంగులకు వివిధ రకాలైన 13 వేల 195 ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారని కొప్పుల పేర్కొన్నారు. ఈ మేరకు రూ.20. 41 కోట్ల వ్యయంతో త్రిచక్రవాహనాలు, వీల్ఛైర్స్, లాప్టాప్స్, 4జీ స్మార్ట్ ఫోన్స్, వినికిడి యంత్రాలు, చేతికర్రలు, ఎంపీ3 ప్లేయర్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
రూ. 90 వేలు విలువ చేసే 900 రిట్రోఫెట్టెడ్ మోటారు వాహనాలు కూడా అవసరమైన వారికి అందజేస్తామని మంత్రి వివరించారు. ఉపకరణాల కోసం ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఆన్లైన్లో www.obmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హతగల దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా మంత్రి కోరారు. జిల్లా కమిటీ ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు ఫిబ్రవరి 15 నుంచి ఉపకరణాలను ఉచితంగా అందజేస్తామని మంత్రి తెలిపారు.