Telangana: హడలెత్తిస్తున్న పెద్దపులి సంచారం.. బిక్కుబిక్కుమంటున్న గ్రామస్థులు
అడవులు తగ్గిపోవడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. గ్రామాల్లో ఇళ్లల్లో చొరబడి భయాందోళన కలిగిస్తున్నాయి. కనిపించిన వారిపై దాడి చేస్తూ హడలెత్తిస్తున్నాయి. తెలంగాణలోని మంచిర్యాల (Mancherial) జిల్లాలో...
అడవులు తగ్గిపోవడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. గ్రామాల్లో ఇళ్లల్లో చొరబడి భయాందోళన కలిగిస్తున్నాయి. కనిపించిన వారిపై దాడి చేస్తూ హడలెత్తిస్తున్నాయి. తెలంగాణలోని మంచిర్యాల (Mancherial) జిల్లాలో పులి సంచారం కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు రెండు రోజుల్లో రెండు పశువులను చంపేసిన పెద్దపులి కోసం వేట మొదలుపెట్టారు. కోటపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్దపులి వణికిస్తోంది. అటవీ గ్రామాలైన ఎడగట్ట, నాగంపేట్, వెంచపల్లి, బొప్పారంలో తిరుగుతోన్న పెద్దపులి.. వరసగా పుశువులపై ఎటాక్ చేస్తూ బీభత్సం సృష్టిస్తోంది. రెండ్రోజుల్లో రెండు పశువులను చంపేసింది పెద్దపులి. దాంతో, ఆ నాలుగు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు? ఎక్కడ? తమపై దాడి చేస్తుందోననే భయంతో పొలాల వైపే వెళ్లేందుకు జంకుతున్నారు. పులి సంచారంపై ప్రజలు ఫిర్యాదు చేయడంతో అటవీ అధికారులు విచారణ మొదలు పెట్టారు. పులి అడుగు జాడలను గుర్తించి, ఆ నాలుగు గ్రామాల్లో చాటింపు వేయించారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, చీకటి పడ్డాక ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచిస్తున్నారు.
అటవీ ప్రాంతానికి సమీపంగా ఉండటంతో వెంచపల్లి, బొప్పారం, ఎడగట్ట, నాగంపేట్, గ్రామాలకు వన్యప్రాణుల బెడద ఎక్కువగా ఉంటోంది. పదేపదే పులులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు మరోసారి పులి గ్రామాల్లోకి రావడంతో ప్రజలు హడలిపోతున్నారు. రెండు రోజుల్లో రెండు పశువులపై దాడిచేసి చంపేయడంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా రేజీంతల్లో పులి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఓ రైతు పొలానికి వెళ్తుండగా చిరుత కనిపింది. దీంతో భయాందోళనకు గురైన అతడు మళ్లీ గ్రామానికి చేరుకుని అటవీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామానికి చేరుకున్న అధికారులు.. ఆ ప్రాంతంలో కాలి ముద్రలను పరిశీలించారు. కాగా, అది చిరుత లేదా మరేదైనా జంతువా అనే విషయాన్ని నిర్ధారిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
కాగా.. మంచిర్యాల జిల్లాలో పులి కలకలం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. పులి కదలికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో ఉన్నావారు గడపదాటి బయటికు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎప్పుడు దాడి చేస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..