Telangana: బడుగు జీవులపై పగబట్టిన విధి.. ఏళ్ల తరబడి స్వేదం చిందించి సొమ్ము పోగేస్తే..
పాపం వారిది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. పిల్లలు లేకపోవడంతో.. జీవిత చరమాకంలో ఉపయోగపడతాయని.. రూాపాయి.. రూపాయి పోగేసి లక్షన్నర దాచిపెట్టారు.
స్వేదం చిందించి కష్టపడి సంపాదించిన డబ్బు. జీవిత చరమాకంలో ఖర్చలకు పనికి వస్తుందని జాగ్రత్తగా రూపాయి.. రూపాయి కూడబెట్టి దాచుకున్న సొమ్ము. కానీ వారి కష్టాన్ని కాలం వెక్కిరిచ్చింది. చెమట చిందించి కూడబెట్టిన ఆ డబ్బు చెదల పాలయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(bhadradri kothagudem district)లో ఈ ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని ఇల్లందు మండలం(yellandu mandal) బాలాజీ నగర్లో నివశించే గడ్డం లక్ష్మయ్య రోజువారీ కూలి. ఆయన భార్య లక్ష్మీ ఎండుమిర్చి తొడాలు తీసే పనికి వెళ్తుంది. ఈ దంపతులకు పిల్లలు లేరు. ఎప్పుడైనా సుస్తి చేసినా.. లేదా వృద్ధాప్యం మీదపడి పనులకు వెళ్లే ఓపిక లేకపోయినా ఇబ్బంది పడకుండా ఉండటానికి.. కూలి నాలి చేస్తే వచ్చిన డబ్బు లక్షన్నర వరకు దాచారు. అయితే చెదలు వారి కష్టాన్ని కొరికి కొరికి మింగేశాయి. సూట్కేస్లో దాచుకున్న కరెన్సీ నోట్లకు చెదలు పట్టడంతో అవి పనికిరాకుండా పోయాయి. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా.. ఎవరూ వారిని పట్టించుకోవడం లేదు. తమ బాధను పట్టించుకునే నాథుడే లేదని ఆ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నాయి. సర్కారోళ్లైనా తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. పాపం కదా..! ఆ దంపతుల సమస్యను అధికారులు త్వరగా పరిష్కరిస్తే బాగుండు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.