ముందే మొదలైన వేసవి.. భగ్గుమంటున్న భానుడు.. ఈసారి సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలంటున్న నిపుణులు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. శీతాకాలపు మంచుతెరలు మెల్లగా విడిపోవాల్సిన సమయంలో వేసవి అప్పుడే మొదలైనట్లు పగటివేళ వాతావరణం సెగలు కక్కుతోంది.

ముందే మొదలైన వేసవి.. భగ్గుమంటున్న భానుడు.. ఈసారి సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలంటున్న నిపుణులు
Temperatures
Follow us

|

Updated on: Mar 01, 2021 | 7:30 PM

Temperatures increased : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. శీతాకాలపు మంచుతెరలు మెల్లగా విడిపోవాల్సిన సమయంలో వేసవి అప్పుడే మొదలైనట్లు పగటివేళ వాతావరణం సెగలు కక్కుతోంది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 4 నుంచి 5 డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నాయి. తూర్పు, ఆగ్నేయ ప్రాంతంలో నెలకొన్న వాతావరణ ప్రభావంతోనే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్ర రాజధానిలో ఇప్పటికే వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తుండగా మూడునాలుగు రోజులుగా భానుడి దెబ్బకు హైదరాబాద్‌వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవికి ముందే సూర్యుడు ప్రతాపం చూపుతున్న నేపథ్యంలో 39.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత సంవత్సరం ఫిబ్రవరి చివరివారంలో ఉష్ణోగ్రత పెరగ్గా, ఈసారి తొలివారంలోనే ఎండ మంట పుట్టిస్తోంది.

రాష్ట్రంలో ఆదివారం గరిష్ఠంగా ఖమ్మం జిల్లా కూసుమంచిలో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఈ ఏడాది ఒక డిగ్రీ ఎక్కువే సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా ఫిబ్రవరిలో ఈ జిల్లాలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. 2017 ఫిబ్రవరి 21న ఇక్కడ 37.8 డిగ్రీలు నమోదైంది. నల్గొండ జిల్లా మునుగోడులో 39.6 డిగ్రీలు నమోదుకాగా 2016 ఫిబ్రవరి 21న ఈ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.6 డిగ్రీలుగా ఉంది. భద్రాచలంలో ఆదివారం 39.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా 2012 ఫిబ్రవరి 27న 38.7 డిగ్రీలుగా నమోదైంది. మంచిర్యాల, జగిత్యాల, వికారాబాద్‌, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పగలు ఎండ, రాత్రి వేడిగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉక్కపోతతో విద్యుత్తు వినియోగం కూడా పెరిగింది. అధిక వేడి ప్రభావం పంటల దిగుబడిపైనా ఉండే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల కిందట రోజువారీ డిమాండు 10 వేల మెగావాట్లు ఉండగా ప్రస్తుతం 13,200 మెగావాట్లకు చేరుకుంది. చలికాలం ముగియడానికి దాదాపు నెలముందే ఉష్ణోగ్రతలు పెరిగాయని బేగంపేట వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అంతేకాదు వచ్చే ఈ వేసవిలో మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈసారి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ దాటే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ ఏడాది సాధారణం కన్నా 0.5 డిగ్రీల నుంచి 1 డిగ్రీ సెల్సియస్‌ అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణ కోర్‌ హీట్‌వేవ్‌ జోన్‌లో ఉన్నట్లు భారత వాతావరణశాఖ పేర్కొంది. దీనివల్ల నడి వేసవిలో సూర్యకిరణాల తీవ్రత అధికంగా ఉంటుందని చెబుతోంది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అప్పుడే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. ‘ఈ ఏడాది ఉత్తర తెలంగాణతో పాటు పలుచోట్ల ఉష్ణోగ్రత గరిష్ఠంగా 45 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మార్చి రెండోవారం నుంచి ఎండలు పెరుగుతాయి. ఈ ఏడాది కొంత వేడిగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి… ఎన్నికల వేళ, గిరిజన యువతులతో డ్యాన్సుల హేల , అస్సాంలో ప్రియాంక గాంధీ రూటే వేరు !