Revanth Reddy: మళ్లీ భగ్గుమన్న వర్గ విబేధాలు.. రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన వాయిదా..!
మరోసారి కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంది. దీంతో రేపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటన సందిగ్దత నెలకొంది. రేవంత్ రెడ్డి సన్నాహక సమావేశంపై సీనియర్లు ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది.
Revanth Reddy Nalgonda Tour: మరోసారి కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంది. దీంతో రేపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటన సందిగ్దత నెలకొంది. రేవంత్ రెడ్డి సన్నాహక సమావేశంపై సీనియర్లు ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన వాయిదా పడింది. అయితే ఇంకా షెడ్యూల్, సభావేదిక ఖరారు కాలేదని సమాచారం. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం రేవంత్ సన్నాహక సమావేశాన్ని వ్యతిరేకిస్తుంటే.. ఇటు జానారెడ్డి, దామోదర్ రెడ్డి వర్గీయులు ఆహ్వానిస్తున్నారు. రేపు రేవంత్ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు..
ముందుగా ప్రకటించిన ప్రకారం.. రేవంత్ రెడ్డి రేపు నల్గొండ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే రేవంత్ పర్యటన వాయిదా పడినట్టుగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ తెలిపింది. రేవంత్ పర్యటన తేదీ త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు వ్యతిరేకించడంతోనే రేవంత్ జిల్లా పర్యటన వాయిదా పడినట్టుగా రేవంత్ రెడ్డి వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.
ఇక, మే 6వ తేదీన వరంగల్లో నిర్వహించే రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి.. కరీంనగర్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నాయకులతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆయన సోమవారం.. కరీంనగర్లో పర్యటించారు. ఉమ్మడి కరీంనగర్కు చెందిన నాయకుల, పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. వరంగల్లో నిర్వహించే రైతు సంఘర్షణ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇక, నేడు ఖమ్మం జిల్లాలో రేవంత్ పర్యటించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తిచేశాయి. అయితే ఖమ్మంలో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీల తొలగింపు వివాదం చోటుచేసుకుంది. రేవంత్ ఖమ్మం రానున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రేవంత్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆవేశంలో కొందరు కార్యకర్తలు అధికారుల వాహనాలపై దాడి చేయడంతో.. అద్దాలు ధ్వంసం అయ్యాయి. అనంతరం రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి.