Rythubandhu: తెలంగాణ రైతులకు గుడ్న్యూస్.. నేటి నుంచి రైతు బంధు పంపిణీ
Rythubandhu: రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చింది. దీంతో ప్రతి ఏడాది రైతుల అకౌంట్లో డబ్బులు..
Rythubandhu: రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చింది. దీంతో ప్రతి ఏడాది రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇక వర్షాకాల సీజన్కు సంబంధించి రైతుబంధు నిధులను పంపిణీ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. విడుతల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. మొత్తంగా 68,94,486 మంది రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఎకరానికి రూ.5వేల చొప్పున విడతల వారీగా రూ.7,654.43 కోట్లను రైతులకు అందించనుంది ప్రభుత్వం.
కొత్తగా 1.53 కోట్ల ఎకరాలకు రైతుబంధు
తెలంగాణ రాష్ట్రంలోని 1.53 కోట్ల ఎకరాలకు రైతు బంధు సాయం అందనుంది. ఈ భూమిని కొత్తగా రైతుబంధు జాబితాలో చేర్చింది ప్రభుత్వం. అయితే యాసంగి సీజన్తో పోల్చితే 3.64 లక్షల మంది రైతులు ఈ సారి కొత్తగా రైతుబంధు అందుకోనున్నారు. రైతుబంధుకు సంబంధించి ఎకరాల వారీగా బిల్లుల జాబితాను వ్యవసాయశాఖ ఇప్పటికే ఆర్థిక శాఖకు అందజేసింది. అయితే మొదటి రోజు ఎకరంలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. మంగళవారం మొత్తం 19.98 లక్షల మందికి రూ.586.65 కోట్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, గత యాసంగి వరకు రైతుబంధు కింద రూ.50,448 కోట్లను ప్రభుత్వం రైతుల బ్యాంకు అకౌంట్లో జమ చేసింది. ఈ సీజన్లో జమ చేయబోయే రూ.7654.43 కోట్లను కలిపితే.. మొత్తంగా రైతుబంధు సాయం రూ.58,102కోట్లకు చేరనుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందులు సృష్టించినా రైతుబంధును అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి