Cooking Oil: వంటనూనెల కృత్రిమ కొరతపై అధికారుల నిఘా.. ఎమ్మార్పీ రేట్లను మార్ఫింగ్ చేస్తున్నవారిపై కేసులు..
Artificial Shortage of Cooking Oil: కృత్రిమ కొరతను సృష్టించి వంట నూనెల ధరలను భారీగా పెంచుతున్న వ్యాపారులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎమ్మార్పీ ధరలను మార్ఫింగ్ చేస్తున్న వారి భరతం పట్టారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పేరుతో వంటనూనెల(Cooking Oil) ధరలను అమాంతం పెంచేశారు వ్యాపారులు. వంటనూనెల కృత్రిక కొరత సృష్టించి వినియోగదారులను దోచుకుంటున్నారు. ఓ వైపు యుద్ధం సాకు.. మరోవైపు ఎమ్మార్పీ ధరలపై కొత్త స్టిక్కర్లతో జనాల జేబుకు చిల్లుపెడుతున్నారు. దొంగ దందాకు తెరలేపిన అధికారులపై నిఘా పెంచారు అధికారులు. వంట నూనెలను పరిమితికి మించి స్టాక్ చేస్తున్న దుకాణాలపై దాడులు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఎమ్మార్పీ ధరలను మార్ఫింగ్ చేస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారు తూనికలు, కొలతల శాఖ అధికారులు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో వంటనూనెల కొరతను సృష్టించి మోసం చేస్తున్న వ్యాపారులపై కొరఢా ఝళిపించారు అధికారులు. రెండు బృందాలుగా విడిపోయిన అధికారులు.. దుకాణాలపై ఆకస్మిక దాడులు చేశారు.
ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎమ్మార్పీ రేట్లను మార్ఫింగ్ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. పరిమితికి మించి వంట నూనెలను స్టాక్ చేసిన దుకాణాలను గుర్తించారు. అధిక ధరలకు వంటనూనెలను అమ్ముతున్న శ్రీలక్ష్మి, కనకదుర్గ, వాసవి, శ్రీశాంతీశ్వర కిరాణా దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ఎమ్మార్పీ(MRP) ధరలపై అదనపు ధరలున్న స్టిక్కర్లను అంటించి దోపిడీకి తెరదీసినట్లు గుర్తించారు.
వినియోగదారుల నుంచి వెల్లువలా వస్తున్న ఫిర్యాదులతో కదిలిన అధికారులు అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అంతేకాకుండా.. పెట్రోల్ బంకుల్లోనూ తనిఖీలు చేశారు. మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ దుకాణ యజమానులతోపాటు పెట్రోల్ బంకు యజమానులను హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి: Yogi Adityanath Oath: రెండోసారి ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్.. కొత్త మంత్రి వర్గంలో మంత్రులు వీరే..