KTR: తెలంగాణవాసులకు గుడ్న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్కార్డులు, పింఛన్లు.. పాలమూరు పర్యటనలో మంత్రి కేటీఆర్ వెల్లడి
కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ.రామారావు పునరుద్ఘాటించారు.
Minister KTR Mahabubnagar Tour: కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ.రామారావు పునరుద్ఘాటించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధిపనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు మంత్రి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ప్రైవేట్ టీచర్లు, సిబ్బందిని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తమదేనని కేటీఆర్ చెప్పారు. జడ్చర్లలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, కావేరమ్మపేట గంగాపూర్ బీటీ రహదారి, నల్లచెరువు మినీట్యాంక్బండ్ అభివృద్ధి పనులను కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత కావేరమ్మపేటలో రెండు పడకగదుల ఇళ్లను పరిశీలించారు. జడ్చర్ల పట్టణంలో మొత్తం రూ.15కోట్ల వ్యయంతో చేపట్టనున్న 8 పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జడ్చర్లకు గతంలో ఎన్నడూ లేనివిధంగా నిధులు కేటాయించి శంకుస్థాపన చేశామని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధి జరగాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న కేటీఆర్.. ఇందుకు అనుగుణంగా ఒక్కొక్క పనిని పూర్తి చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో కొద్దిమందికే రూ.75 పింఛను ఇచ్చే వాళ్లని.. దానికీ యుద్ధం చేయాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 పింఛను ఇచ్చి విపరీతమైన ప్రచారం చేసుకుందని.. కానీ తమ ప్రభుత్వం రూ.2వేలు ఇస్తోందన్నారు.
దేశంలో 24గంటల పాటు నిర్విరామంగా విద్యుత్ అందిస్తున్న ఘనత ఒక్క తెలంగాణ రాష్ట్రానిదేనన్న కేటీఆర్.. గృహాలతో పాటు వ్యవసాయం, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాకముందు, నేటి పరిస్థితులను బేరీజు వేసుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు. త్వరలోనే కొత్త రేషన్కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.
జడ్చర్ల నియోజకవర్గంలోని కావేరమ్మ పేట గ్రామంలో త్రాగునీటి సరఫరా కోసం నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను మరియు బిటి రోడ్డును ప్రారంభించిన మంత్రులు @KTRTRS, @VSrinivasGoud. ఈ కార్యక్రమంలో ఎంపీ @MpManne, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. pic.twitter.com/lO4uucq3Ye
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 14, 2021
అంతకు ముందు రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరులో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణంలో కొత్తగా నిర్మించనున్న మున్సిపాలిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. కొత్తూరు వై జంక్షన్, బటర్ఫ్లై వీధిలైట్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కొత్తూరులో ఇప్పుడు ఎంతో అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు. రీజినల్ రింగ్రోడ్డు ద్వారా షాద్నగర్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఇంతటి ఎండాకాలంలోనూ ఇంటింటికి మంచినీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉంటే మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.