Heavy Rain: తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. వాగులోకి దూసుకెళ్లిన కారు.. అత్యధిక వర్షపాతం కొమురంభీం జిల్లాలో!
Heavy Rain: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగాయి. తెలంగాణలో..
Heavy Rain: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగాయి. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో పెరుగుతున్న వరద తాకిడిపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. యుద్ధ ప్రాతిపదికన ఆయా ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సీఎస్కు సూచించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉండడంతో ప్రజాప్రతినిధులంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని సీఎం ఆదేశించారు. అలాగే మరోవైపు, రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. రానున్న మరో రెండుమూడు రోజులు కూడా భారీగా వానలు పడే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ వారి హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్ర స్థాయి అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు.
గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు కురిసిన వర్షానికి కొమురంభీం జిల్లాలో అత్యధికంగా 31.48 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. జగిత్యాల లో 23 సెం.మీ, వరంగల్ రూరల్ లో 21 సెం. మీ వర్షపాతం నమోదైంది. నిర్మల్ 18 సెం.మీ, నిజామాబాద్ 17 సెం.మీ నమోదు కాగా, ఇతర ప్రాంతాల్లో కూడా భారీగానే నమోదైంది. భారీ వర్షం కారణంగా ఎగువ నుంచి నీరు వచ్చి చేరడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను సైతం వదిలిపెట్టారు. ఇతర ప్రాజెక్టులు సైతం నిండిపోవడంతో ప్రాజెక్టు గేట్లను సైతం వదిలి నీటిని దిగువన వదిలిపెడుతున్నారు. ములుగు జిల్లాలో ఉన్న బోగత జలపాతాలు ఉగ్రరూపం దాల్చాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో బోగత జలపాతాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. అత్యంత ప్రమాదకరంగా వరద నీరు ఉప్పొంగి పొర్లడంతో అధికారులు సందర్శకులను అనుమతించడం లేదు.
యాదాద్రిలో విరిగిపడ్డ కొండచరియలు
కాగా, భారీ వర్షం కారణంగా గురువారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే ఘాట్రోడ్డులోని రెండో మూలమలుపు వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవ్వరు కూడా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అధికారులు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతంలో ఎవ్వరు కూడా వెళ్లకుండా చర్యలు చేపట్టారు. వర్షానికి మరిన్ని బండరాళ్లు పడే అవకాశం ఉందని వాహనాలను మొదటి ఘాట్ రోడ్డు గుండా మళ్లించారు. తర్వాత అధికారులు బండరాళ్లను సహాయంతో తొలగించారు. కొండపై నూతనంగా నిర్మించిన క్యూలైన్లల్లోకి వర్షపు నీరు చేరింది.
వాగులోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు గల్లంతు
జగిత్యాల జిల్లా అనంతారం వాగులో గురువారం రాత్రి నీటి ప్రవాహానికి ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ వాగు వంతెన పైనుంచి భారీగా నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాకపోకలను నిలిపివేశారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో మెండోరాలో భారీ వర్షాలకు ఓ ఆశ్రమాన్ని వదర నీరు చుట్టుముట్టింది. ఏడుగురు వ్యక్తులు అక్కడే చిక్కుకుపోయారు. హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం, అలీసాగర్ జలాశయం నుంచి గజ ఈతగాళ్లను రప్పిస్తున్నారు.