T Congress leaders: సీఎం కేసీఆర్ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. సమావేశ వివరాలు తెలిపిన భట్టి విక్రమార్క
T Congress leaders met CM KCR: తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య కీలక భేటీ ముగిసింది. సమావేశానికి సంబంధించిన కొన్ని వివరాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య కీలక భేటీ ముగిసింది. సమావేశానికి సంబంధించిన కొన్ని వివరాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఇది రాజకీయ భేటీ కాదని.. కొన్నిరోజుల క్రితం అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్కు గురైన మరియమ్మ విషయమై సీఎంను కలిసామన్నారు. మరియమ్మ కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని భట్టి తెలిపారు. అలాగే మరియమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తామనే హామీని కూడా సీఎం కేసీఆర్ ఇచ్చారని భట్టి పేర్కొన్నారు.
మరియమ్మ కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని కోరామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. లాకప్ డెత్కు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరామని భట్టి తెలిపారు. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని భట్టి ఆరోపించారు. 28వ తేదీలోగా మరియమ్మ కుటుంబానికి అన్నిరకాల సాయం చేసేందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.
ఆదివారం డీజీపీని మరియమ్మ స్వగ్రామానికి వెళ్లాలని ఆదేశిస్తామని సీఎం తెలిపారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేసీఆర్ను కలిసిన వారిలో భట్టి , శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, రాజగోపాల్రెడ్డి ఉన్నారు. అయితే ఈ భేటీ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది. తెలంగాణ వచ్చాక తొలిసారిగా కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పాయింట్ మెంట్ తీసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.