CM KCR Released Godavari Water: మెతుకు సీమలో జలసిరులు.. కొండపోచమ్మ సాగర్ నుంచి హల్ది వాగులోకి గోదారమ్మ పరుగులు..
తెలంగాణలో మరో జల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. ఎండా కాలంలో నీటి జాడ తెలియని మెతుకు సీమపై గోదావరి జలాలను పరుగులు పెట్టిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా... కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని హల్దీ వాగులోకి...
CM KCR Released Godavari Water: తెలంగాణలో మరో జల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. ఎండా కాలంలో నీటి జాడ తెలియని మెతుకు సీమపై గోదావరి జలాలను పరుగులు పెట్టిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా… కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని హల్దీ వాగులోకి వదిలారు. ఆ నీటిని మంజీరా నది నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టుకు తరలిస్తారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జలాలు మేడిగడ్డ, మిడ్ మానేరు మీదుగా కొండపోచమ్మ సాగర్ చేరుకున్నాయి.
కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలు నిజాంసాగర్ వైపు పరుగులు పెడుతున్నాయి. గోదావరి నుంచి మంజీరా మీదుగా నిజాంసాగర్లోకి వెళుతున్నాయి. మరో పది రోజుల్లో అక్కడికి చేరుకుంటాయి. చరిత్రలో ఎప్పుడూ ఈ సీజన్లో ఈ ప్రాంతానికి నీళ్లొచ్చిన పరిస్థితి లేదు. వర్షాకాలంలో మాత్రమే, అది కూడా భారీ వర్షాలు పడినప్పుడు మాత్రమే చెరువుల్లోకి నీరు చేరేది. అలాంటిది భగీరథ ప్రయత్నం చేసి కాళేశ్వరం నిర్మాణం పూర్తి కావడంతో కరువు సీమకు నీరు చేరుతోంది.
కొండపోచమ్మ సాగర్ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్ది వాగులోకి గోదావరి జలాలను వదిలారు సీఎం కేసీఆర్. వర్గల్ మండలం అవుసులోనిపల్లి వద్ద గోదావరికి సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పూజలు నిర్వహించారు. గోదావరి తల్లికి హారతి పట్టి పట్టు వస్త్రాలను వదిలారు.
ఇక్కడి నుంచి మొదట వర్గల్ మండలం చౌదరిపల్లి బంధం చెరువులోకి నీరు చేరుతోంది. అక్కడి నుంచి గొలుసుకట్టు చెరువులైన వర్గల్ పెద్ద చెరువు, శాకారం ధర్మాయి చెరువు, అంబర్పేటకాని చెరువులు నిండుతాయి. ఆ తర్వాత నాచారం మీదుగా హల్దివాగుకు గోదావరి జలాలు చేరతాయి. 98 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వాగు మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావపూర్, నాగులపల్లి మీదుగా కామారెడ్డి జిల్లాలోని మంజీరా నదిలో కలుస్తుంది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీరుకూరు, నసుల్లాబాద్, నిజామాబాద్ జిల్లా బోధన్, కోటగిరి, వర్గి, ఆర్మూరు తదితర ప్రాంతాల్లోని 30 వేల ఎకరాలకు నీరు అందుతుంది. ఈ మధ్యలో ఉన్న 32 చెక్ డ్యామ్లు నిండుతాయి. పాయింట్ 62 టీఎంసీల నీరు వీటిల్లో నిల్వ ఉంటుంది.
ఎండకాలంలోనూ సాగునీటిని అందించేలా సంగారెడ్డి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలోని చెరువులు జలకళను సంతరించుకోనున్నాయి. తక్షణం 14వేల ఎకరాలకు పైగా సాగునీరు అందనుంది. మరోవైపు, మర్కూక్ మండలం పాములపర్తి శివారులోని కెనాల్ ద్వారా గోదావరి జలాలను గజ్వేల్ కాలువలోకి విడుదల చేశారు.