Agnipath Scheme Protest: రాకేశ్ మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. రూ. 25లక్షల ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటన..
Agnipath Scheme Protest: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసుల కాల్పుల్లో యువకుడి మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Agnipath Scheme Protest: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసుల కాల్పుల్లో యువకుడి మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువకుడి కుటుంబానికి ఎక్స్గ్రేషియాతోపాటు ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరిగిన ధర్నా హింసాత్మకం కావడంపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం.. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందివ్వాలంటూ అధికారులను ఆదేశించారు.
కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానాసహా పలు రాష్ట్రాల్లో సాయుధ దళాల ఉద్యోగార్థులు కదం తొక్కారు. కేంద్రానికి వ్యతిరేకంగా విధ్వంసం సృష్టిస్తూ నిరసన వ్యక్తంచేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చెలరేగిన హింసపై సీఎం కేసీఆర్ ఆరాతీశారు. ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని పోలీసులను ఆదేశించారు. పోలీసుల కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మృతిపై దిగ్భాంతి వ్యక్తంచేశారు. రాకేశ్ కుటుంబానికి సీఎం అండగా నిలిచారు. కేంద్రం పరిధిలోని అంశంకదా అని వదిలేయకుండా.. రాకేశ్ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచారు. 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రాకేశ్ కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వం ఉద్యోగ కల్పిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఇక రాకేశ్ ఫ్యామిలీకి అండగా నిలిచిన సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలాఉంటే.. సికింద్రాబాద్ హింసపై సీఎంకేసీఆర్ ఫైరయ్యారు. కేంద్రం తప్పుడు నిర్ణయాలే ఆందోళనలకు కారణమన్నారు. తెలంగాణ బిడ్డలను కడుపున పెట్టుకుని చూసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. మోదీ అనాలోచిత నిర్ణయాలతో దేశ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నాడైనా.. నేడైనా తెలంగాణ నిరుద్యోగ యువతకు టీఆర్ఎస్ అండగా నిలుస్తందన్నారు సీఎం. అగ్నిపథ్ స్కీం విషయంలో కేంద్రం పునరాలోచించాలని హితవు పలికారు. లేదంటే యువకుల ఆగ్రహ జ్వాలల్లో మోదీ మసికావడం ఖాయమన్నారు. నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న కేంద్రానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు.