Officials Suspension: పల్లె ప్రగతి, హరితహారం, పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు అధికారులపై వేటు.. సర్పంచ్కు షోకాజ్!
సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పల్లె ప్రగతి నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ అధికారులపై వేటు పడింది.
Negligence Officials Suspension in Sangareddy District: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన కఠినచర్యలు తీసుకోవాలని, ప్రజా ప్రతినిధులను సైతం భాగస్వాములను చేయాలని సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి జిల్లా పర్యటనల్లో పాల్గొంటున్నారు. అయితే, ఇవేవీ పట్టనట్లు నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ అధికారులపై వేటు పడింది.
ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మిషన్ భగీరథ మంచి నీళ్లు గ్రామానికి సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అంగథ్ కుమార్ను సస్పెండ్ చేశారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్య పనులు, హరితహారం, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంలో అలసత్వం వహించిన పంచాయతీ కార్యదర్శి నందీశ్వర్ని విధుల నుంచి తప్పించారు. అలాగే, గ్రామ సర్పంచ్ పార్వతికి సైతం షోకాజ్ నోటీస్ జారీ చేశారు కలెక్టర్ హనుమంతరావు.
ఏపీఎంకు గ్రామంలో మహిళా సంఘాలచే మహిళలకు తడి, పొడి చెత్త వేరు చేయడంలో అవగాహన కల్పించనందున షోకాజ్ నోటిస్ జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. హరిత హారంలో ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏపీవోకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. గ్రామ ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో రమేశ్ చంద్ర కులకర్ణిని కలెక్టర్ నియమించారు. పల్లె ప్రగతి, హరితహారం, పారిశుద్ధ్య పనులు గ్రామంలో రెండు రోజుల్లో పూర్తి చేయాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.