Secunderabad Railway Station: శరవేగంగా సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ది పనులు..
దక్షిణ మధ్య రైల్వేలో ప్రధాన రైల్వే స్టేషన్ అయిన సికింద్రబాబ్ రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. 2025 అక్టోబర్ నాటికి ఈ పనులను పూర్తి చేసే లక్ష్యంతో పనుల్లో స్పీడ్ పెంచారు.
దక్షిణ మధ్య రైల్వేలో ప్రధాన రైల్వే స్టేషన్ అయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. 2025 అక్టోబర్ నాటికి ఈ పనులను పూర్తి చేసే లక్ష్యంతో పనుల్లో స్పీడ్ పెంచారు. భూసార పరీక్షకు సంబందించిన పనులు, ఫోటోగ్రాఫిక్ సర్వే పూర్తయ్యాయి. తదుపరి దశకు సంబంధించిన నిర్మాణ పనులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి.
టోపోగ్రాఫిక్ సర్వే ఆధారంగా సైట్ లే అవుట్, సరిహద్దు నమూనా పనులు పురోగతిలో వున్నాయి. అప్గ్రేడ్ చేయబడిన స్టేషన్ బిల్డింగ్లో అధునాతనమైన హంగులతో బుకింగ్ కార్యాలయం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న స్టేషన్కు ఉత్తరం వైపు వచ్చే మల్టీ-లెవల్ కార్ పార్కింగ్కు అనుగుణంగా, ప్రస్తుత బుకింగ్ కార్యాలయాన్ని తాత్కాలికంగా మార్చాల్సి రావడంతో.. ద్విచక్ర వాహనాల పార్కింగ్ గేట్ నంబర్ 3 సమీపానికి మార్చారు. అలాగే బుకింగ్ కార్యాలయం మార్చేందుకు, తాత్కాలిక బుకింగ్ కార్యాలయం నిర్మాణం కోసం పనులు వేగంగా జరుగుతున్నాయి.
అదేవిధంగా, పాత రైల్వే క్వార్టర్స్ను తొలగించగా.. కొత్త ఆర్పిఎఫ్ కార్యాలయ నిర్మాణం కోసం పునాదుల తవ్వకం పనులు పురోగతిలో ఉన్నాయి. పునరాభివృద్ధి పనిలో ముఖ్యమైన నిర్మాణ సామగ్రి కోసం కాస్టింగ్ యార్డ్, వర్క్ ఏరియాను ఏర్పాటు చేయడానికి మాత్రమే కాకుండా మెటీరియల్స్ని నిల్వచేసేందుకు కూడా భూమిని కేటాయించారు. ఇది సైట్, స్టేషన్ మధ్య సామాగ్రిని చేరవేసేందుకు సహాయపడుతుంది.
కొత్తగా రూపుదిద్దుకోనున్న స్టేషన్ భవనానికి సంబంధించి ప్లాట్ఫారమ్, కవర్ ఓవర్ షెల్టర్ సంభావిత పైకప్పు నమూనా ఖరారయ్యింది. రైలు ప్రయాణికులకు ప్లాట్ఫారమ్లపై సదుపాయాలు కల్పించడమే కాకుండా, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి, ఆధునిక నిర్మాణాన్ని చేపట్టడానికి కొత్త ఎలివేటెడ్ కవర్ రూపొందించబడం జరిగింది.
రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన “ప్రధాన రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి”లో భాగంగా, సికింద్రాబాద్ స్టేషన్ను ఒకటిగా గుర్తించింది. ఇందులో భాగంగా.. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, ఆధునిక ఆర్కిటెక్చర్తో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను డెవలప్ చేయడానికి ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ విధానంలో ఖరారు చేయడం జరిగింది. స్టేషన్ పునరాభివృద్ధి పనులు అక్టోబర్ 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు.
ఈ కీలక ప్రాజెక్టు పురోగతిని ప్రతి దశలోనూ పర్యవేక్షిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. సౌత్ జోన్లో సికింద్రాబాద్ అతిపెద్ద స్టేషన్ అని, పునరాభివృద్దిలో భాగంగా స్టేషన్లో ప్రయాణికుల కోసం అన్ని ఆధునిక ఫీచర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే 40 ఏళ్ల అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు జైన్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..