Nirmal: నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారం.. రూ.166 కోట్ల అంచనాతో నిర్మాణం.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
Nirmal: తెలంగాణలోని నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. నిర్మల్ లో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణంలో కీలక అడుగు ముందు పడింది. జిల్లా ప్రభుత్వ ..
Nirmal: తెలంగాణలోని నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. నిర్మల్ లో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణంలో కీలక అడుగు ముందు పడింది. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి అనుబంధ వైద్య కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పరిపాలన అనుమతులు జారీ చేస్తూ జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. దీంతో కళాశాల ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియ వేగంగా సాగనుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా సముదాయంలో నూతన వైద్య కళాశాల అందుబాటులోకి రానుంది.
100 ఎంబీబీఎస్ సీట్లతో రూ.166 కోట్ల అంచనా..
100 ఎంబీబీఎస్ సీట్లతో రూపాయలు 166 కోట్ల అంచనా వ్యయంతో నిర్మల్ లో వైద్య కళాశాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా మంజూరైన ఈ కళాశాల మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. ఈ స్థలంలోని వైద్య కళాశాల భవన సముదాయం, వసతి గృహం, ప్రత్యేక వార్డులు, బ్లాకులను నిర్మించనున్నారు. వైద్య కళాశాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీతో ఇక నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
ఆవిర్భావం తర్వాత నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో వైద్య సదుపాయాల కల్పన పెరుగుతూ వస్తుంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఇప్పటికే అనేక రకాల ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. రూ. 40 కోట్ల అంచనా వ్యయంతో 5 ఎకరాల విస్తీర్ణంలో 250 పడకల జిల్లా ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతుంది. పట్టణంలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్, రేడియాలజీ ల్యాబ్, పాలియేటివ్ కేర్ విభాగాలు రోగులకు సేవలు అందిస్తున్నాయి. నిర్మల్ జిల్లా ప్రాంతాల్లోని పేదోడి వైద్యానికి నిర్మల్ లోని ఆసుపత్రి భరోసా ఇస్తుంది.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో ఏళ్ల మెడికల్ కళాశాల ఏర్పాటు కల సాకారం కావడంతో నిర్మల్ జిల్లా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. నిర్మల్ జిల్లాకు మెడికల్ కాలేజ్ ను మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు రాడవంతో పట్టణంలో ఘనంగా సంబరాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించేలా చర్యలు: మంత్రి
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా ప్రజలు ఎంతోకాలంగా వైద్య కళాశాల కోసం ఎదురుచూస్తున్నారని, వారి కోరికను సీఎం కేసీఆర్ నేరవేర్చారన్నారు. ఇచ్చిన హామీ మేరకు నిర్మల్ జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. వైద్య కళాశాలతో నిర్మల్ అద్భుతమైన వైద్య విజ్ఞాన కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
త్వరలో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు:
త్వరలో జిల్లాలో నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు కానుందని మంత్రి తెలిపారు. నిర్మల్ జిల్లా అభివృద్ధిలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు కదులుతున్నామన్నారు. కొంత మంది అవగాహనరాహిత్యంతో అవాకులు చెవాకులు చేశారని, ఇప్పుడు వారు ఏం సమాధానం చెప్పుతారని మంత్రి ప్రశ్నించారు. ఇప్పటికైనా వక్రబుద్ధితో మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి