ఎంపీ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ.. ఎక్కడంటే..
ఎన్నికల వరకూ ఓటర్ల చుట్టూ తిరిగే నాయకులు ఎన్నికల్లో గెలిచిన తరువాత మొహం చాటేయడం తరచూ జరిగేదే. ప్రజలకు ఇది ప్రతి ఎన్నికల సమయంలోనూ అనుభవమే.
Peddapalli: ఎన్నికల వరకూ ఓటర్ల చుట్టూ తిరిగే నాయకులు ఎన్నికల్లో గెలిచిన తరువాత మొహం చాటేయడం తరచూ జరిగేదే. ప్రజలకు ఇది ప్రతి ఎన్నికల సమయంలోనూ అనుభవమే. వాళ్ళు కూడా అదేమీ పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు. ఆ ఎంపీ గారికి ఎన్నిపనులు.. మన ఊరు రాలేదు అనుకుంటే ఎలా అని పాపం సర్దుకుపోతుంటారు. కానీ, రాజకీయనాయకులు ఊరుకోరుగా. అందులోనూ ప్రతిపక్ష పార్టీలు అప్పుడప్పుడు అలాంటి ప్రజాప్రతినిధులకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఇప్పుడు అదే జరిగింది పెద్దపల్లిలో.
పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతా కనిపించడం లేదంటూ బీజేపీ నేతలు కొత్తతరహా నిరసన కార్యక్రమం నిర్వహించారు. బెల్లంపల్లిలో శనివారం అయన ఫోటోలు పట్టుకుని పెద్ద ర్యాలీ చేశారు. అలా భారీ ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి జిల్లాలో అప్పుడప్పుడు పర్యటించడం తప్ప ఎంపీ వెంకటేష్ ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చెయాయలేదని ఈ సందర్భంగా ఆంజనేయులు చెప్పారు. పార్టీలు మారి ఎంపీ అయిన వెంకటేష్ ఇప్పుడూ రాజకీయాలే పనిగా ఉన్నారన్నారు. తమ పార్టీకి చెందిన బండి సంజయ్ ఏబీవీపీ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారని.. పార్టీలు మారి పదవులు సాధించలేదనీ విమర్శించారు.
కాంగ్రెస్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని నోటికొచ్చి తిట్టిన వెంకటేష్.. ఇప్పుడు అదే పార్టీలో కొనసాగుతూ కేసీఆర్పై ప్రేమ ఒలకబోస్తున్నారని అన్నారు. ఆయనకు ధైర్యం ఉంటే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల సమస్యలపై కేసీఆర్తో మాట్లాడాలని, దళితుడిని ముఖ్యమంత్రిని చేసేలా నిలదీయాలని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వర్రావు, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు రాచకొండ సత్యనారాయణ, బీజేపీ జిల్లా కార్యదర్శి మల్యాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై తెలంగాణ నేతల ఫైర్.. కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టొద్దని వార్నింగ్