TS Congress: సత్యగ్రహ దీక్షలో బాహాబాహి.. పరకాల కాంగ్రెస్లో వర్గ పోరు..
అగ్నిపథ్కు వ్యతిరేకంగా చేపట్టిన కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష ఆ పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు బయటపడేసింది. సత్యాగ్రహ దీక్ష వేదికగా నువ్వెంత నువ్వెంత అని పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఘర్షణ పడ్డాయి.
అగ్నిపథ్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన సత్యగ్రహ దీక్ష పరకాల కాంగ్రెస్లో అగ్నిజ్వాలలు రగిలించింది. సత్యగ్రహ దీక్షకు హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేత ఇనుగాల వెంకట్రామిరెడ్డి వర్గం, కొండా సురేఖ వర్గం ఘర్షణ పడ్డాయి. సత్యాగ్రహ దీక్ష వేదికగా రెండు వర్గాల కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఈ దీక్షలో కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ పాల్గొన్నారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై కొండా మురళి, ఇనగాల వెంకట్రామిరెడ్డి వర్గీయుల మధ్య వాగ్వవాదం చోటుచేసుకుంది. దీక్ష శిబిరం వద్దే పిడిగుద్దులు గుద్దుకున్నారు. అటు వరంగల్ పోచమ్మ మైదాన్లో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో ఫ్లెక్సీల దుమారం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ రాజయ్య ప్లెక్సీని తొలగించి కొండ దంపతుల ప్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో రాజయ్య దీక్షకు హాజరు కాకుండా దూరంగా ఉన్నారు. మొత్తానికి సత్యాగ్రహ దీక్ష కాంగ్రెస్లో విభేదాలను బట్టబయలు చేసింది.
అయితే.. అగ్నిపథ్కు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేసింది కాంగ్రెస్. టి.పీసీసీ నేతలు, ఎమ్మెల్యేలు జిల్లాల్లో సత్యాగ్రహ దీక్ష పేరుతో నిరసన చేపట్టారు. మల్కాజ్గిరిలో నిరసన చేపట్టారు టి.పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. అగ్నిపథ్ను రద్దు చేసే వరకు ఆందోళనలు చేస్తామన్నారు. ఆర్మీలో అవకాశాలను దెబ్బతీసి, సికింద్రాబాద్లో కాల్పులకు కారణమైన మోదీ ఇక్కడి యువతకు క్షమాపణ చెప్పాకే హైదరాబాద్ రావాలన్నారు. లేదంటే ఆయన పర్యటనలో నిరసన వ్యక్తం చేయాలని యువతకు పిలుపునిచ్చారు.
ఖమ్మం జిల్లా వైరాలో నిరసన చేపట్టారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. వ్యవసాయ చట్టాలను రద్దు చేసి రైతులకు క్షమాపణ చెప్పినట్లుగానే దేశ యువతకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.