Minister KTR: విశ్వనగరంగా హైదరాబాద్..త్వరలోనే పూర్తికానున్న ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు పనులు.. అసెంబ్లీలో స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ను విశ్వనగరంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. రోడ్ల అభివృద్దికి 5వేల 9వందల కోట్ల రుణం తీసుకున్నామని అసెంబ్లీలో ప్రకటించారు.
హైదరాబాద్ను విశ్వనగరంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. రోడ్ల అభివృద్దికి 5వేల 9వందల కోట్ల రుణం తీసుకున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ రోడ్ల అభివృద్ధిపై అసెంబ్లీలో స్వల్ప చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రోగ్రాం చేపట్టిన ప్రణాళికా బద్దంగా చేపడుతుందన్నారు. మూడేళ్ల పాటు ట్రాఫిక్పై చర్చించిన తర్వాతనే ఎస్ఆర్డీపీని అమలు చేస్తున్నామని అన్నారు.
హైదరాబాద్లో మోతాదుకు మించి ఉన్న వాహనాలతో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిందన్నారు. మొదటి దశ ఎస్ఆర్డీపీలో 2వేల కోట్లతో 22 ఫ్లైఓవర్లను పూర్తి చేశామని తెలిపారు. గ్రేటర్ శివారు ప్రాంతలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఒక్క ఎల్బీ నగర్లోనే 850 కోట్లతో నాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఖర్చు చేసే ప్రతీ రూపాయి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమేనన్న మంత్రి.. హైదరాబాద్లోని ప్రతి లొకేషన్కి ఫ్లైఓవర్-లింక్ రోడ్తో అనుసంధానం ఉందన్నారు.
చార్మినార్, సౌత్ జోన్ల పరిధిల్లో 1545కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి కేటీఆర్. పాత బస్తీలో త్వరలోనే పై వంతెన పనులు ప్రారంభిస్తామన్నారు. ఉత్పాదక రంగంలో వెచ్చించే ప్రతి రూపాయి భవిష్యత్తు పెట్టుబడిగానే చూడాలన్నారు. కొత్త రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి, ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయని గుర్తు చేశారు. భవిష్యత్లో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని వివరించారు. ఎస్ఆర్డీపీ రెండో దశ ప్రణాళికలు పూర్తయ్యాయని తెలిపారు.