KTR London Tour: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా యూకేలో మంత్రి కేటీఆర్ బిజీబిజీ..
KTR London Tour: యూకేలో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్నారు
KTR London Tour: యూకేలో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. తొలిసారిగా యూకేలో పర్యటిస్తున్న ఐటీ మంత్రి, తెలంగాణలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను అక్కడి సంస్థలకు, కంపెనీలకు వివరిస్తున్నారు. తాజాగా, యునైటెడ్ కింగ్డం-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన మంత్రి కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు.
యూకేలోని ప్రముఖ కంపెనీల బృందాలకు, తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను వివరించారు మంత్రి కేటీఆర్. టీఎస్ ఐపాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ ఫైనాన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా-లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు కోసం తీసుకొచ్చిన పాలసీలు, వాటితో ఇప్పటిదాక తెలంగాణకు వచ్చిన భారీ పెట్టుబడుల వివరాలను కంపెనీల ప్రతినిధులకు వివరించారు. భూమి, నీరు, విద్యుత్ సదుపాయాలు, నాణ్యమైన మానవ వనరులు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను సాదరంగా స్వాగతిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. అసలు సిసలైన కాస్మోపాలిటన్ కల్చర్ హైదరాబాద్లో మాత్రమే ఉందన్నారు. భారత్లో జీవించేందుకు అత్యంత అనువైన నగరంగా హైదరాబాద్, అనేకసార్లు అవార్డులను అందుకున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు హైదరాబాద్ హాబ్గా మారిందని వివరించారు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య దశాబ్దాలుగా ఉన్న బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాల నేపథ్యంలో, పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు తెలంగాణను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని, విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్. ఈ నెల 26 వరకు సాగనున్న పర్యటనలో, యూకేలోని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు, వాణిజ్యవేత్తలతో సమావేశం కానున్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ కూడా పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు.