CJI Ramana3 నెలల్లోనే కల సాకారమైంది.. ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ
హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు తన స్వప్నమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ చెప్పారు. ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుతో పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడిందన్నారు.
International Arbitration Mediation Center: హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు తన స్వప్నమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ చెప్పారు. ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుతో పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. కేవలం 3 నెలల్లోనే తన కల సాకారం కావడం అదృష్టమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, జస్టిస్ హిమా కోహ్లీకి సీజేఐ కృతజ్ఞతలు చెప్పారు.
హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్కు తొలి అడుగు పడింది. ప్రూపంచవ్యాప్తంగా వాణిజ్య సంస్థల వివాదాల పరిష్కారానికి ప్రస్తుతం సింగపూర్ వంటి దేశాలపై ఆధారపడుతున్న కంపెనీలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ట్రస్టు డీడ్ రిజిస్ట్రేషన్కు సీజేఐ ఎన్.వి రమణ హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమాకోహ్లీ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. సుప్రీం కోర్టు జడ్జిలు లావు నాగేశ్వరరావు, సుభాష్రెడ్డి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్నారు.
1926లో తొలి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం మొదలైంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ కంపెనీలు ఆర్బిట్రేషన్ కోసం సింగపూర్, దుబాయ్ వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు పరిస్థితి మారుతుందని.. అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు కూడా హైదరాబాద్ వస్తారని అన్నారు CJI ఎన్.వి.రమణ. కోర్టుల చుట్టూ తిరిగే బాధ కూడ తప్పుతుందన్నారు. ఆర్బిట్రేషన్ ఏర్పాటు బాధ్యత జస్టిస్ లావు నాగేశ్వరరావు తీసుకోవాలని కోరారు. త్వరగా ఈ కేంద్రం కార్యకలాపాలు జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు జస్టిస్ ఎన్.వి.రమణ. తాను కన్న కల కేవలం మూడు నెలల్లోనే సాకారం కావడం అదృష్టమన్నారు . తెలంగాణ సీఎం కేసీఆర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీల సహకారంతోనే హైదరాబాద్కు అంతర్జాతీయ అర్బిట్రేషన్ సెంటర్ వచ్చిందన్నారు. మౌలిక వసతులు, ఆర్థిక సహకారానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు.
భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు…సేవలను కూడా గుర్తుచేసుకున్న సీజేఐ ఎన్వీరమణ..ఆయన హయాంలోనే ఆర్బిట్రేషన్ చట్టం రూపుదిద్దుకుందని గుర్తుచేశారు. పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ వంటి నగరంలో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు మంత్రి కేటీఆర్. సొంతంగా చొరవ తీసుకుని మరీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దీనిని సాధించారన్నారు. భాగ్యనగరంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు కానుండటంపై పలు ఇంటర్నేషన్ కంపెనీలు సంతోషం వ్యక్తం చేశాయి. ఇకపై ఇతర దేశాల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పుతుందన్నారు.