Andhra Pradesh: కలకలం రేపుతున్న చిరుతపులి సంచారం.. భయంతో బిక్కుబిక్కుమంటున్న ఉత్తరాంధ్ర వాసులు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో వన్యప్రాణుల సంచారం వణుకు పుట్టిస్తోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతాల్లో క్రూర మృగాలు కనిపిస్తుండంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా కాకినాడ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న పెద్దపులి...
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో వన్యప్రాణుల సంచారం వణుకు పుట్టిస్తోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతాల్లో క్రూర మృగాలు కనిపిస్తుండంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా కాకినాడ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న పెద్దపులి ఘటనను మరవకముందే.. శ్రీకాకుళం, అనంతపురం, ప్రకాశం జిల్లాలో ఎలుగుబంట్లు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో అధికారులు చేపట్టిన ఆపరేషన్ లో ఓ ఎలుగుబంటి మృతి చెందింది. అదే సమయంలో మరో ఎలుగుబంటి రావడంతో స్థానికులు భయపడుతున్నారు. తాజాగా అల్లూరి, విజయనగరం జిల్లా సరిహద్దులో చిరుతపులి సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న (శనివారం) జీలుగుమిల్లి పంచాయతీ జిల్లా సరిహద్దు గ్రామమైన చిలకలగెడ్డ సమీపంలో ఒక గేదెపై చిరుత దాడి చేసి చంపేసింది. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతాన్ని అటవీ అధికారులు పరిశీలించారు. పులి అడుగుజాడలను తీసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. చిరుతపులి అనంతగిరి మండలం వైపు వెళ్ళినట్లుగా గుర్తించారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో కనిపించిన పులి, ఇదీ ఒకటే అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చిరుతపులిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా పెద్దపులి సంచారంతో బిక్కుబిక్కుమంటున్నామని, పొలాలకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
మరోవైపు.. కాకినాడలో సీసీ కెమెరాలకే పరిమితమైన పులిని ఓ వ్యక్తి చూశాడు. రౌతులపూడి మండలం యస్.పైడపాల గ్రామంలో పట్టపగలే సంచరిస్తున్న పులిని చూసి అవాక్కయ్యాడు. అప్పలనాయుడు అనే వ్యక్తి.. ఉదయం 9.30గంటల సమయంలో గేదెలను తోలుకుని సమీపంలోని గెడ్డకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి నీళ్లు తాగేందుకు పెద్దపులి రావడంతో హడలిపోయాడు. వెంటనే అప్రమత్తమై ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అడవికి చేరుకున్న అధికారులు పులి అడుగు జాడలు ఉన్నట్లు గుర్తించారు.