Hyderabad: మార్చి 2023 నాటికి ఓఆర్ఆర్ పరిధిలో 978 కాలనీలకు నీటి సరఫరా: జలమండలి
గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలో ఉన్న దాదాపు 978 కాలనీలకు నీటి సరఫరాకు సంబంధించి పనులు మర్చి 2023 నాటికి..
గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలో ఉన్న దాదాపు 978 కాలనీలకు నీటి సరఫరాకు సంబంధించి పనులు మర్చి 2023 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు. వర్షాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మళ్లీ ఓఆర్ఆర్ ఫేజ్ – 2 పనుల్లో వేగం పెంచాలని అధికారులను జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు నీటి సరఫరా చేసేందుకు గానూ రూ.1,200 కోట్లతో జలమండలి ఓఆర్ఆర్ ఫేజ్ – 2 పనులను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఓఆర్ఆర్ – 2 పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. రిజర్వాయర్లు, ఇన్లెట్, అవుట్లెట్, డిస్ట్రిబ్యూషన్ లైన్ల నిర్మాణ పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ… వచ్చే ఏడాది మార్చి నాటికి ఓఆర్ఆర్ ఫేజ్ – 2 పనులను పూర్తి చేసి ప్రజలకు నీరు అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు ఇన్లెట్, అవుట్లెట్ పనులు, డిస్ట్రిబ్యూషన్ లైన్ పనులు కూడా సమాంతరంగా చేపట్టాలని సూచించారు. ఇందుకు కావాల్సిన పైపులు, స్పెషళ్లు, తదితర సామాగ్రిని సరిపడా సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. సరిపడా కార్మికులు ఉండేలా చూసుకోవాలని సూచించారు.
కార్మికులకు రక్షణ కల్పించాలి:
పైప్లైన్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పైప్లైన్ విస్తరణ పనులు పూర్తి చేయగానే ఎప్పటికప్పుడు రోడ్డు పునరుద్దరణ పనులు కూడా పూర్తి చేయాలని పేర్కొన్నారు. కార్మికులు తప్పనిసరిగా రక్షణ పరికరాలను ధరించేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులు జరుగుతున్న చోట్ల బారీకేడ్లు చేయాలని ఆదేశించారు.
కొత్తగా డైరెక్టరేట్ కార్యాలయం నిర్మాణం:
ఓఆర్ఆర్ ఫేజ్ – 2 పనుల్లో భాగంగానే అవసరమైన చోట్ల నిర్మిస్తున్న కార్యాలయాల పనులను కూడా మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కొత్తగా ఒక డైరెక్టర్ కార్యాలయాన్ని కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఫేస్-2 ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే వాటర్ బోర్డు 149 కాలనీలకు తాగునీటి సరఫరాను పూర్తి చేసింది. మిగిలిన 829 కాలనీలకు మార్చి 2023 నాటికి నీటి సరఫరా చేసేలా పనులను ముమ్మరం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో నివసించే ప్రజలు దశాబ్దాల కాలం నుంచి నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. నీటి కొరత సమస్యను పరిష్కరించేందుకు ఓఆర్ఆర్-2 ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాంతాల్లో నీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.1200 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేయగా, వాటర్ బోర్డు పనులు చేపడుతోంది.
మణికొండ, కుత్బుల్లాపూర్, ఘట్కేసర్, కీసర ప్రాంతాల్లో కొన్ని నీటి కనెక్షన్లు అందించబడ్డాయి. అలాగే ఈ ప్రాజెక్టు కింద నీటి సరఫరాను పెంచడంతో పాటు పనులు జరుగుతున్న ఇతర మండలాల్లో సరూర్నగర్, రాజేంద్రనగర్, ఇబ్రాహీంపట్నం, శంషాబాద్, శామీర్పేట, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఘట్కేసర్, బొల్లారం తదితర ప్రాంతాల్లో 137 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో స్టోరేజీ రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు 2,864 కిలోమీటర్ల మేర కొత్త పైప్లైన్ నెట్వర్క్ను ఏర్పాటు చేసి ఆరు లక్షల మందికిపైగా నీటి సరఫరా అందజేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి