Gaddar: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అందుకే కలిశా.. అసలు విషయం బయటపెట్టిన గద్దర్..
పాట.. ప్రతిపక్షం లాంటిది, దాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రజాగాయకుడు గద్దర్(Gaddar). తన వయస్సు 75ఏళ్లయితే, తన శరీరంలో ఉన్న తూటా వయసు పాతికేళ్లు అన్నారు...
పాట.. ప్రతిపక్షం లాంటిది, దాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రజాగాయకుడు గద్దర్(Gaddar). తన వయస్సు 75ఏళ్లయితే, తన శరీరంలో ఉన్న తూటా వయసు పాతికేళ్లు అన్నారు. పాటే ప్రాణంగా బతికిన తనపై వివిధ రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నాయన్నారు గద్దర్. ఉద్యమంలో ఉండగా తనపై అనేక అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెట్టారని గుర్తుచేశారు. ఆ కేసులన్నింటినీ ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరానన్నారు గద్దర్. అందుకే హోంమంత్రి(Amitha Shah)కి దీనిపై వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. తన వయసును దృష్టిలో పెట్టుకుని వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులను ఎత్తివేయాలని మొమెరాండం ఇచ్చానన్నారు. తానిచ్చిన వినతిపత్రాన్ని అమిత్షా అసలు చూశారో లేదో తెలుసుకోవడానికే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి(Kishan Reddy)ని కలిసినట్లు తెలిపారు గద్దర్. తానిచ్చిన కవర్ను అమిత్షా ఓపెన్ చేశారో లేదో తెలియదన్నారు.
తన వినతిపత్రాన్ని పరిశీలించి, తనపై నమోదైన కేసులను ఎత్తివేసేలా చూడాలని కిషన్రెడ్డిని కోరినట్లు తెలిపారు. ఈ నెల 14న తుక్కుగూడలో బీజేపీ సభ కంటే ముందు గద్దర్ కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసి వినతి పత్రం ఇచ్చారు. అక్కడే ఉన్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్ గురించి చెప్పారు. అప్పుడే ఒక సీల్డ్ బ్రౌన్ కవర్ను కేంద్ర మంత్రి అమిత్ షాకు గద్దర్ అందజేయడంతో దానిని ఆయన తన వ్యక్తిగత కార్యదర్శికి అప్పగించారు. ఇటీవలి కాలంలో గద్దర్ అన్ని పార్టీల నేతలను కలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం వరి ధాన్యం కొనాల్సిందేనంటూ గత నెలలో టీఆర్ఎస్ చేపట్టిన దీక్షలో గద్దర్ పాల్గొన్నారు. కొద్దిరోజుల క్రితం రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనలో ఆయన్ను కలిశారు. తాజాగా బీజేపీ సభలో ప్రత్యక్షమయ్యారు. ఈ పరిణామాలతో గద్దర్ అడుగులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
మరిన్ని వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి…