Hyderabad: ఐసీయూలోకి హడావిడిగా వెళ్లిన డాక్టర్.. అక్కడ్నుంచి నేరుగా జైలుకే.. మేటర్ ఏంటంటే
డాక్టర్ గారు హడావిడిగా ఐసీయూలోకి ఎంటరైపోయారు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఏమో అనుకున్నారు అక్కడున్న స్టాఫ్.. రోగి బంధువులు. కానీ ఆ తర్వాత అసలు మేటర్ రివీలయ్యింది.
పెద్ద, పెద్ద ఆస్పత్రుల్లో చాలామంది వైద్యులు ఉంటారు. అక్కడికి వెళ్లి వైద్యం చేయమని చేతులెత్తి మొక్కడం తప్ప.. ఎవరూ ఏంటి అన్నది పెద్దగా ఎంక్వైరీ చేయరు చాలామంది. ఈ లూప్ను పట్టేశాడు ఓ కంత్రీగాడు. డాక్టర్ మాదిరి వేసం కట్టి.. నేరుగా ఆస్పత్రి ఐసియూలోకి వచ్చాడు. అందరూ అతడిని డాక్టరే అనుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఓ రోగి బంధువుల నుంచి డబ్బులు లాగుదామని ప్రయత్నించాడు ఆ కేటుగాడు. చివరకు జైల్లో చిప్పకూడు తింటున్నాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జరిగిన ఈ ఘటన కాస్త లేటుగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పంజాగుట్ట పోలీసులు(Panjagutta Police) వెల్లడించారు.
అనారోగ్య సమస్యలు ఉండటంతో… ఈ నెల 16న ఓ వ్యక్తిని బంజారాహిల్స్(Banjara Hills)లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించారు కుటుంబ సభ్యులు. అప్పటి నుంచి ఆ రోగికి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అదే రోజు గుర్తుతెలియని వ్యక్తి డాక్టర్ గెటప్లో ఐసీయూలోకి హడావిగా వచ్చాడు. తెలివిగా షేషెంట్ కేసు షీట్ను పరిశీలించి రోగి సహాయకుడి ఫోన్ నంబరు తీసుకున్నాడు. వాళ్లకు ఫోన్ చేసి అత్యవసర ఆపరేషన్ చేయాలని, వెంటనే రూ.50 వేలు పంపించాలని చెప్పాడు. అయితే ఇక్కడే అతడి ప్లాన్ బెడిసి కొట్టింది. తమకు ఈఎస్ఐ కింద ట్రీట్మెంట్ అందుతుందని.. డబ్బులెందుకని రోగి కుటుంబ సభ్యుల ప్రశ్నించాడు. ఈఎస్ఐ కార్డు ద్వారా వచ్చిన వారికి రూ. 12,500 మాత్రమే బిల్లులో రాయితీ వస్తుందని.. మిగతా డబ్బు చెల్లించాలని చెప్పుకొచ్చాడు. అతడి మాట తీరుపై అనుమానం కలగడంతో రోగి బంధువులు.. ఆస్పత్రి యాజమాన్యానికి వివరాలు తెలిపారు. వారు ఎంక్వైరీ తీయగా సదరు నకిలీ డాక్టర్ బాగోతం వెలుగుచూసింది. ఆస్పత్రి సెక్యూరిటీ ఆఫీసర్ కంప్లైంట్ మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని సంతోష్నగర్కు చెందిన మహ్మద్ జకీరుద్దీన్(19)గా గుర్తించారు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.