CS Somesh Kumar : తెలంగాణ చీఫ్ సెక్రటరీతో భేటీ అనంతరం ఉద్యోగ సంఘాలు ఫుల్ హ్యాపీ
ఉద్యోగులు, వాళ్ల కుటుంబసభ్యుల వైద్య అవసరాల నిమిత్తం అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ కు అనుమతులిస్తామని..
Telangana Employees Union : ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ చెప్పారు. ఉద్యోగులు, వాళ్ల కుటుంబసభ్యుల వైద్య అవసరాల నిమిత్తం అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ కు అనుమతులిస్తామని, ఏపీలో ఉన్న 123 మంది మినిస్టీరియల్ ఉద్యోగులను వెనక్కు తెస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. పీఆర్సీ కొత్త జీతాలు ఈ నెల నుంచే అందుతాయని తెలిపారు.
హైదరాబాద్ బీఆర్కే భవన్ లో తెలంగాణ సీఎస్ తో ఉద్యోగ సంఘాలు ఇవాళ భేటీ అయ్యాయి ఈ సమావేశంలో ఉద్యోగులకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తీపి కబుర్లు చెప్పారు. కింది స్థాయి ఉద్యోగుల పిల్లల ఆన్ లైన్ క్లాసుల కోసం లోన్ లో సెల్ ఫోన్లు ఇప్పించాలన్న నిర్ణయం సంతోషకరమని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. వాహనాల కొనుగోళ్ల కోసం బ్యాంకు లోన్లు ఇచ్చేందుకు ప్రభుత్వ అనుమతులు ఇచ్చినందుకు కూడా ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు.
తమ సమస్యల పరిష్కారానికి తెలంగాన ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. తమ సమస్యలను ప్రభుత్వానికి తెలిపిన సీఎస్కు ఈ సందర్భంగా జేఏసీ నేతలు మామిండ్ల రాజేందర్, మమత, తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.