High Court: బీజేపీ అగ్ర నేత బీఎల్ సంతోష్కు ఊరట.. సిట్ నోటీసులపై హైకోర్టు స్టే..
సిట్ ఇచ్చిన 41A నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇవాళ బీఎల్ సంతోష్ హైకోర్టులో సీఆర్పీసీ 41ఏ నోటీసు రద్దు చేయాలని లంచ్ మోషన్ దాఖలు చేశారు.
బీజేపీ అగ్ర నేత బీఎల్ సంతోష్కు ఊరట లభించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం జారీ చేసిన నోటీసులపై బీజేపీ నేత బీఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీ 41ఏ నోటీసు రద్దు చేయాలని లంచ్ మోషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్లో వాదనలు సాగాయి. ఈ కేసులో విచారణకు ఈనెల 26న లేదా 28న హాజరు కావాలని బీఎల్ సంతోష్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను రద్దు చేయాలని బీఎల్ సంతోష్ శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు సిట్ జారీ చేసిన నోటీసులపై డిసెంబరు 5వరకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
పైలెట్ రోహిత్రెడ్డి ఫిర్యాదులో సంతోష్ పేరు లేదన్న పిటిషనర్ తరఫు న్యాయవాది. ఫిర్యాదులో లేనప్పుడు FIRలో ఎలా చేరుస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బీఎల్ సంతోష్ పాత్రపై ఆధారాలు ఉన్నాయన్నారు ప్రభుత్వ న్యాయవాది. సంతోష్ విచారణకు వస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని వాదనలు వినిపించారు.
41A నోటీసులిచ్చిన తర్వాత సంతోష్ను నిందితుడుగా చేర్చినట్లు.. ఏసీబీ కోర్టులో మెమో ఎలా వేస్తారని ప్రశ్నించారు సంతోష్ తరఫు న్యాయవాది. 41A నోటీసుల విషయంలో హైకోర్ట్ సింగిల్ జడ్జ్ ఆదేశాలను ప్రస్తావించింది ఏజీ.
దీనిపై అంతకుముందు ఇదే కేసులో తనకు తెలంగాణ సిట్ నోటీసులు అందాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఢిల్లీలోని తన నివాసంలో సిట్ నోటీసులు అందజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 29న బంజారాహిల్స్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించినట్లు చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం