AP – Telangana: తెలంగాణ రాష్ట్రాల్లో వానలు, వరదలు.. అన్ని ప్రాంతాల నుంచి తాజా రిపోర్ట్ ఇది..
అటు ఏపీ, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
రెండు రోజులు గ్యాప్ ఇస్తే.. నాలుగు రోజులు నాన్స్టాప్గా కురుస్తోంది వాన.. హైదరాబాద్లోనే కాదు తెలుగురాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో అదే పరిస్థితి. ముసురేసి మరీ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వాన కాలం ముగింపులో రెయిన్స్ ముంచేస్తున్నాయి. వరద ఉధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. వీధులన్నీ వరదపోటుకి గురవుతున్నాయి. పట్టణాల్లో మోకాళ్ల లోతు నీళ్లతో జనజీవితం అస్తవ్యస్తంగా మారుతోంది. అకస్మాత్తుగా భారీ ప్రవాహంతో కాలనీలు నీట మునుగుతున్న పరిస్థితి. హైదరాబాద్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో వరద గోదారి ముచ్చెమటలు పట్టిస్తోంది. హైదరాబాద్లో నిన్న కురిసిన వానకి నాగోల్ ఏరియా చిగురుటాకులా వణికిపోయింది. ఒక్కసారిగా వరద అంతకంతకు పెరిగింది. ఏకంగా ఇళ్లల్లోకి వరద నీరుచేరింది. దీంతో ఐదు కాలనీలకు చెందిన ప్రజలు ఇబ్బందిపడ్డారు. దాదాపు 2,500ల కుటుంబాలపై వరద ప్రభావం స్పష్టంగా కనిపించింది. వరద వెళ్లేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు.
మహబూబ్నగర్ ఇంకా వరద గుప్పిట్లోంచి బయటపడలేదు. ఏకధాటిగా కురిసిన వానకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు కాలనీల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. నిన్న మూడు గంటలపాటు ముంచెత్తిన వానతో సిటీ సంద్రంలా మారింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో 10 సెంటిమీటర్లకు పైగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు, కాలనీలు చెరువులను తలపించాయి. వాహనాలు నీటమునిగాయి. థియేటర్లలోకి వరదనీరు చేరి హాల్ అంతా నీట మునిగిన పరిస్థితి. బీకే రెడ్డిలో వరద బాధిత ప్రాంతాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. మెదక్, సూర్యాపేట జిల్లాల్లోనూ అదే వర్షం. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.
ఏపీలోనూ వానలు.. వరదలు
కడపజిల్లాలో వానలకి జలశయాలు నిండుకుండల్ని తలపిస్తున్నాయి. పెన్నా నదిలోని అప్రోచ్ రెడ్డు తెగిపోవడంతో జమ్మలమడుగు, ముద్దనూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జమ్మలమడుగు మండలంలోని 14 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. నెల రోజుల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారి. అనంతపురం జిల్లా చిన్న ఎక్కలూరు గ్రామ సమీపంలో అనుకోని ప్రమాదం జరిగింది. రోడ్డుమీద బైక్పై వెళుతున్న ఓ వ్యక్తిపై సడెన్గా కరెంట్ తీగలు తెగిపడ్డాయి. దీంతో స్పాట్లోనే చనిపోయాడతను. అధికారుల నిర్లక్ష్యమే ప్రాణాలు బలితీసుకుందని గ్రామస్థులు మండిపడ్డారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో భారీ వర్షం కురిసింది. వాహనదారులు, పనులకు వెళ్లేవాళ్లు ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి కురిసిన వర్షానికి నల్లవాగు ఉప్పొంగి ప్రవహించింది. అటు రామచంద్రనగర్లోని పలు ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి. గోనెగండ్ల మండలం గంజాహళ్లి దగ్గర మల్లెల వాగు.. నందవరం మండలం పెద్ద కొత్తిలి గ్రామంలో కొత్తిలివంకలో వాగు ఉదృతంగా ప్రవహించింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లా హోలగుంద సమీపంలో తుంగభద్ర దిగువ కాలువలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. దిగువ కాలువ సిబ్బంది వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. అటు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలోని నాగార్జునసాగర్ కాలువలో ప్రమాదవశాత్తు మునిగి ఇద్దరు మృతి చెందారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి లంక గ్రామాలు భయంగానే గడుపుతున్నాయి. మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో ఇళ్లలోకి వరదతో పాటు విష సర్పాలు చేరుతున్నాయి. మామిడికుదురు మండలంలో రోజుకో చోట తాచుపాములు కనిపిస్తున్నాయి. ఇళ్లలోకి చేరి, పడగ విప్పి బుసలు కొడుతుండడంతో.. జనం వణికిపోతున్నారు. అటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ వానలు దంచికొట్టాయి. శనివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది వాతావరణ శాఖ.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి