Hyderabad: హైదరాబాద్ లో డ్రగ్ ముఠా గుట్టు రట్టు.. డ్రగ్ యూజర్స్, సప్లయిర్ల సమాచారముంటే.. ఈ నెంబర్ కి కాల్ చేయండి
హైదరాబాద్ లో మరో డ్రగ్ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. వీళ్లు మొత్తం ఎంత మంది? సప్లయిర్లకూ పెడ్లర్లకూ ఉన్న లింకేంటి? పట్టుబడ్డ వారెవరు? పరారీలో ఉన్న వారెందరు?
డ్రగ్ సప్లయిర్లతో పాటు ఐదుగురు పెడ్లర్ల అరెస్టు. 36 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం. 16 మంది కన్జ్యూమర్స్ గుర్తింపు. వీరిలో ఎనిమిది మంది అదుపులోకి.. ఈ కేసులో వీరందరిని ఇన్ వాల్వ్ చేస్తున్నాం అంటున్నారు.. హైదరాబాద్- నార్కొటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ పోలీసులు. డ్రగ్ కేసులో పట్టుబడ్డవారంతా.. చెన్నైలోని ఒక కాలేజీలో చదువుతున్నప్పటి పరిచయస్తులుగా చెబుతున్నారు పోలీసులు. అక్కడ మెయిన్ సప్లయిర్ నుంచి డ్రగ్ తీసుకోవడంతో వీరంతా అక్కడ కలిశారనీ.. చదువు కంప్లీట్ అయ్యాక హైదరాబాద్ కి వచ్చి పెడ్లర్లుగా మారారనీ.. గ్రాము ఏడు వేల రూపాయల చొప్పున వీరు అమ్ముతున్నట్టు గుర్తించామని అంటున్నారు.
డ్రగ్ కన్జ్యూమ్ చేసేవారికి కౌన్సెలింగ్ ఇస్తున్నామనీ.. ఈ కేసులో ప్రధాన నిందితుడు తమిళనాడుకు చెందిన విష్ణు అని.. ఇతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడనీ.. ఇతని కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు చెప్పారు పోలీసులు. అయితే డ్రగ్ అలవాటు ఉన్న వారి సమాచారం కానీ అమ్ముతున్నవారి ఇన్ఫర్మేషన్ మీ దగ్గరుంటే.. 9490616688 నెంబర్ కు తెలియ చేయవల్సిందిగా కోరుతున్నారు అధికారులు.
డ్రగ్స్ రవాణాను గుర్తించేందుకు ఆధునిక పరికరాలు
తెలంగాణలో డ్రగ్స్ వినియోగాన్ని, అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల రవాణాను గుర్తించేందుకు పోలీసు శాఖకు ఆధునిక పరికరాలను అందజేస్తామని సీఎస్ ప్రకటించారు. డ్రగ్స్ అక్రమ రవాణాను నిరోధించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. మంగళవారం ఉదయం బీఆర్కే భవన్లో సీఎస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధక కమిటీ సమన్వయ సమావేశం జరిగింది.