Telangana Cm Kcr: పొలిటికల్ హీట్ పెంచిన సీఎం కేసీఆర్ నినాదం.. దసరాకు కన్ఫామ్ అయినట్లేనా!?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటనలో చేసిన నినాదం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఇవాళ వరంగల్లో పర్యటించిన ఆయన.. జై తెలంగాణ, జై భారత్ అంటూ నినాదించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటనలో చేసిన నినాదం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఇవాళ వరంగల్లో పర్యటించిన ఆయన.. జై తెలంగాణ, జై భారత్ అంటూ నినాదించారు. దసరా పండుగ వేళ జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన చేసిన ఈ నినాదం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్ని వసతులు, అన్ని వనరులు ఉన్న పూలబొకే లాంటి దేశంలో కొందరు విష బీజాలు నాటుతున్నారని పరోక్షంగా బీజేపీని విమర్శించారు. దేశంలో ఏం జరుగుతోందో విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. తన వయసు ఇప్పుడు 68 ఏళ్లని, భవిష్యత్తు విద్యార్థులదేనని అన్నారు. ఇదే సమయంలో కేంద్రమంత్రుల తీరుపైనా విమర్శలు చేశారు సీఎం కేసీఆర్. రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి తిడుతున్నారని, అలా తిట్టిన వారే ఢిల్లీలో రాష్ట్రానికి అవార్డులు ప్రకటిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అయితే, రాజకీయాల్లో భాగంగానే కేంద్ర మంత్రులు విమర్శలు చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల అండదండలతో కొనసాగిన ఉద్యమం అద్భుతంగా రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అనేక రంగాల్లో ఇవాళ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిందని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా ఉందని, ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. వరంగల్లో ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రిని సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు. 350 పడకల సామర్థ్యంతో ఆస్పత్రిని నిర్మించారు. ప్రతిమ వైద్య కళాశాలలో 150 మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలోని 33 జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలు కట్టబోతున్నామని ప్రకటించారు సీఎం కేసీఆర్. కేంద్రం వివక్షతో ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా, రాష్ట్రమే 33 కాలేజీలను కట్టాలని నిర్ణయించిందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్య 17కు చేరిందని, ఎంబీబీఎస్ సీట్లు 6500కు పెరిగాయన్నారు. వైద్య విద్య కోసం మన విద్యార్థులు ఉక్రెయిన్ లాంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు సీఎం. తెలంగాణలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను తయారు చేస్తామని చెప్పారు.
వీఆర్ఏల వినతిపత్రం తీసుకున్న సీఎం కేసీఆర్..
ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వా్య్ వెళ్తున్న దారిలో వీఆర్ఏలు ప్లకార్డులు ప్రదర్శించారు. దాంతో వీఆర్ఏలను గమనించిన సీఎం.. తన కాన్వాయ్ ఆపి వీఆర్ఏ ల వినతిపత్రం తీసుకున్నారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరారు. కాగా, తమ డిమాండ్ల సాధణ కోసం కొద్ది నెలలుగా వీఆర్ఏలు నిరసన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ సైతం హామీ ఇచ్చారు. ఇవాళ సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ నేపథ్యంలో తమ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేశారు వీఆర్ఏలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..