రివర్స్ సోషల్ ఇంజనీరింగ్.. ఏపీలో బీజేపీ బ్రహ్మాస్త్రం..

మతతత్వ ముద్ర మీదేసుకున్న భారతీయ జనతా పార్టీ కుల సమీకరణాల్లోనూ ఏ ఇతర పార్టీతో తీసిపోని విధంగా వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్న కమలనాథులు, తెలుగు రాష్ట్రాల్లో.. అందునా ఆంధ్రప్రదేశ్‌లో కులాలవారిగా లెక్కలు వేస్తూ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ ప్రయత్నం గత కొన్నేళ్ల క్రితమే మొదలైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో విజయవంతమైన ఓ ఫార్ములాను అనుసరిస్తూ ఏపీలో అమలు చేసే ప్రయత్నం చేసింది. ఇంతకీ ఆ ఫార్ములా ఏంటంటే.. […]

రివర్స్ సోషల్ ఇంజనీరింగ్.. ఏపీలో బీజేపీ బ్రహ్మాస్త్రం..
Follow us

|

Updated on: Jan 22, 2020 | 2:50 PM

మతతత్వ ముద్ర మీదేసుకున్న భారతీయ జనతా పార్టీ కుల సమీకరణాల్లోనూ ఏ ఇతర పార్టీతో తీసిపోని విధంగా వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్న కమలనాథులు, తెలుగు రాష్ట్రాల్లో.. అందునా ఆంధ్రప్రదేశ్‌లో కులాలవారిగా లెక్కలు వేస్తూ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ ప్రయత్నం గత కొన్నేళ్ల క్రితమే మొదలైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో విజయవంతమైన ఓ ఫార్ములాను అనుసరిస్తూ ఏపీలో అమలు చేసే ప్రయత్నం చేసింది. ఇంతకీ ఆ ఫార్ములా ఏంటంటే.. ఏ రాష్ట్రంలో చూసినా రాజకీయాల్లో ఒకట్రెండు, మహా అయితే మూడు నాలుగు సామాజికవర్గాలదే ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. హరియాణా రాష్ట్రంలో జాట్ల ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధికారంలో ఏ పార్టీ వచ్చినా జాట్ వర్గానికి చెందినవారే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం అక్కడ రివాజుగా మారింది. ఈ సాంప్రదాయానికి బ్రేకులు వేసిన బీజేపీ జాటేతర వర్గాలను ఏకం చేసే ప్రయత్నం చేసింది. సఫలమై జాటేతర నేతనే సీఎం సీటుపై కూర్చోబెట్టింది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ అమలు చేసి మెరుగైన ఫలితాలు సాధించింది. ఆ రాష్ట్రంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటీ ఒక్కో సామాజికవర్గం ఓటు బ్యాంకు మీద ఆధారపడి రాజకీయాలు చేస్తున్నాయి. యాదవులు పూర్తిగా సమాజ్‌వాదీ వెంట, దళితులు పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వెంట నిలిచేవారు. ముస్లిం మైనారిటీల ఓట్ల కోసం అటు ఎస్పీ, ఇటు బీస్పీ, జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎవరికి వారే గాలాలు వేస్తూ ఉండేవారు. అయితే ముస్లింలలో అత్యధికులు సమాజ్‌వాదీ పార్టీ వెంట నిలిచేవారు. ఈ సోషల్ ఇంజనీరింగ్‌ను గమనించిన కమలనాథులు తమ సాంప్రదాయ ఓటు బ్యాంకైన బ్రాహ్మిణ్, బనియా, ఠాకూర్లతో పాటు యాదవేతర బీసీలను తమవైపు తిప్పుకోవడంలో సఫలమయ్యారు. బీసీల్లో యాదవులకు తప్ప మిగతా కులాలకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదన్న ఆవేదనను బీజేపీ ఒడిసిపట్టింది. అలాగే దళితుల్లోనూ చమార్లకు తప్ప ఇతరులకు ప్రాధాన్యత లేదన్న అసంతృప్తిని కూడా క్యాష్ చేసుకుంటూ దళిత ఓటు బ్యాంకులోనూ చీలిక తీసుకొచ్చింది. అలాగే త్రిపుల్ తలాఖ్ బిల్లు ద్వారా ముస్లిం ఓటు బ్యాంకులోనూ మహిళల ఓట్లను చీల్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో చాలా చోట్ల ముస్లింలు తమ ఇళ్లళ్లో నుంచి మహిళలను ఓటు వేయడానికే బయటకు పంపని పరిస్థితి ఏర్పడింది. “ముస్లింలు ఎలాగూ మా ఓటర్లు కాదు, ఆ వర్గం నుంచి ఒక్క ఓటు వచ్చినా మాకు ప్రయోజనమే. అసలు ఆ ఓటు ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా మాకు ప్రయోజనమే కదా” అని బీజేపీలో ఓ నేత చేసిన వ్యాఖ్యలు వారి వ్యూహాన్ని తెలియజేశాయి.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. రాష్ట్ర విభజన కంటే ముందు నుంచి చూసినా గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ అధికారం ఆర్థికంగా బలంగా ఉన్న కమ్మ, రెడ్డి సామాజికవర్గాల మధ్యనే చేతులు మారుతూ వస్తోంది. సహజంగానే రాజ్యాధికారానికి దూరంగా ఉన్న మరికొన్ని బలమైన సామాజికవర్గాల్లో అసంతృప్తి ఉంటుంది. దాన్ని ఏకీకృతం చేసి లబ్ది పొందాలన్నదే బీజేపీ అసలు వ్యూహం. సంఖ్యాబలం ఉన్నప్పటికీ రాజ్యాధికారం దక్కించుకోలేకపోతున్నామనే ఆవేదన కాపుల్లో బలంగా ఉందని బీజేపీ అధిష్టానం పెద్దలు గ్రహించారు. అందుకే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే తమ వ్యూహాన్ని అమలు చేసే ప్రయత్నం చేశారు. ఒక దశలో పార్టీ వీడి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డ కన్నా లక్ష్మీనారాయణను ఆపి మరీ రాష్ట్రాధ్యక్ష బాధ్యతలు భుజాన పెట్టడం వెనుక వ్యూహాం ఇదేనని అందరికీ తెలుసు. కానీ ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీ పాచిక ఏమాత్రం పారలేదు. ఇందుక్కారణాలను విశ్లేషించుకున్న కమలనాథులు.. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కాపు ఓట్లను ఆకర్షించుకునే ప్రయత్నాలు చేయడం వల్ల ఆ ఓట్లు చీలిపోయాయని గుర్తించారు. పైగా కాపులు సొంతం చేసుకుంటారనుకున్న జనసేనను తెలుగుదేశం బీ-టీమ్‌గా భావించి పూర్తిగా సొంతం చేసుకోలేకపోయారని విశ్లేషించుకున్నారు. అయినప్పటికీ జనసేన రాష్ట్రంలో 6.78 శాతం ఓట్లను సాధించింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల వరకే లెక్కలు వేస్తే అక్కడ ఇంకాస్త ఎక్కువగానే ఉందని తేలింది.

అందుకే ఇప్పుడు 2024ను దృష్టిలో పెట్టుకుని రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. కాపు ఉపకులాలన్నీ కలుపుకుంటే మొత్తం జనాభాలో దాదాపు 20 శాతం వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఓట్లను ఏకం చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. ఆ క్రమంలోనే జనసేనతో దోస్తీ మొదలుపెట్టారు. అయితే కేవలం కాపులను మాత్రమే నమ్ముకుంటే సరిపోదు. రెడ్డి, దళిత, మైనారిటీ వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటుబ్యాంకుగా ఉన్నాయి. అవి మినహా మిగతా వర్గాలను కూడా ఏకం చేస్తే ఉపయోగం ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు. ముఖ్యంగా కాపు+కమ్మ+బీసీ కాంబినేషన్‌పై దృష్టి సారించారు. ఆర్థికంగా బలంగా ఉన్న కమ్మ వర్గం సమాజాన్ని ప్రభావితం చేసే మీడియా, సినీమా రంగాల్లోనూ ఆధిపత్యం కలిగి ఉన్నారని, వారికి కాపు సంఖ్యాబలాన్ని, బీసీ ఓటుబ్యాంకును జోడిస్తే సామాజిక సమీకరణాల్లో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదంతా జరగాలంటే తెలుగుదేశం పార్టీతో విడదీయలేనంతగా పెనవేసుకున్న కమ్మ వర్గాన్ని దూరం చేసి తమవైపు ఆకట్టుకోవాలి. రాజ్యసభ నుంచి చేపట్టిన ఈ ఆపరేషన్లో మొత్తం నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలో చేర్చుకోగా, అందులో ఇద్దరు ఆ వర్గానికి చెందినవారే. ఆ తర్వాత కూడా ఆకర్ష్ పర్వం కొనసాగుతోంది. తాజాగా కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో బీజేపీ నేత సోము వీర్రాజు మంతనాలు సాగించారు. బీజేపీకి మద్ధతు కోరే బదులు, ఏకంగా బీజేపీలోనే చేరాలని ఆహ్వానం పలికారు. తద్వారా కాపు ఓట్లను బీజేపీ+జనసేన కూటమి వైపు పూర్తిగా ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ రెండు వర్గాలకు ప్రాధాన్యతనిస్తున్నామనే సందేశం ఆయా వర్గాల్లోకి బలంగా వెళ్లాలంటే ఆ వర్గాలకు చెందిన నేతలకు కీలక పదవులివ్వాలి. ఆ కసరత్తే ఇప్పుడు మొదలైంది. ఇద్దరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి, మరొకరికి రాష్ట్ర నాయకత్వం ఇవ్వాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీజేపీలో ఉన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యరాలు పురందేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగించి, కాపు వర్గం నుంచి ఒకరిని కేంద్ర మంత్రిగా తీసుకోవాలని తొలుత అనుకున్నారు. తద్వారా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ మంది నేతలను బీజేపీలోకి ఆకర్షించే అవకాశం కూడా ఉంటుందని స్కెచ్ వేశారు. అయితే పురందేశ్వరి మాత్రం రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. దీంతో రాష్ట్ర నాయకత్వం కాపు వర్గం నేత చేతుల్లోనే ఉంచి, కేంద్ర మంత్రి పదవిని కమ్మ వర్గానికి ఇవ్వాలని భావిస్తున్నట్టు తాజా సమాచారం. ఈ క్రమంలో కన్నా లక్ష్మీనారాయణకు మరోసారి అవకాశం లేదా కాపు వర్గానికి చెందిన పైడికొండల మాణిక్యాల రావు, సోము వీర్రాజులను పరిగణలోకి తీసుకోవచ్చని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనాకు తదుపరి జరిగే కేబినెట్ విస్తరణలో చోటు కల్పిస్తారని కూడా జోరుగా చర్చ జరుగుతోంది. కనీసం ఒక్క సీటు, ఒక శాతం ఓటు షేరు కూడా సాధించలేకపోయిన ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అమలు చేస్తున్న భిన్న సామాజిక సమీకరణాలు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

-మహాత్మ కొడియార్ సీనియర్ జర్నలిస్టు, టీవీ9

పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్