Munugode by-poll: ఫలితాల తర్వాతే దసరా, దీపావళి చేసుకుందాం.. బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపు..
మునుగోడులో పొలిటికల్ హడావుడి కనిపిస్తోంది. అది సందడి స్టేజ్ నుంచి.. గోల వరకు వెళ్లింది. ఇంకా నెల రోజులకన్నా తక్కువే సమయం ఉండడంతో స్ట్రాటజీల అమలులో బిజీగా ఉన్నాయి పార్టీలు..
అన్ని పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలను సెమీ ఫైనల్గానే భావిస్తున్నాయి. తమ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటర్లను సెలబ్రిటీలకంటే ఎక్కువగా ట్రీట్ చేస్తున్నాయి. వద్దన్నా పలకరింపులు..ఎప్పుడూ చూడని నేతల కౌగిలింపులు..అపార ప్రేమ కురిపించేలా ఆత్మీయ సమావేశాలు.. సమ్మేళనాలు.. వనభోజనాలు.. అబ్బో.. ఒకటా రెండా.. గ్రాఫిక్స్ మాయాజాలం లేకుండానే.. స్పిల్బర్గ్ను మించిన రేంజ్లో మునుగోడు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు పార్టీల నేతలు.. బీజేపీ అయితే రెండాకులు ఎక్కువే అన్నట్లుంది..
మునుగోడులో బీజేపీ దమ్మేంటో చూపిద్దాం. ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ అస్సలు కనిపించదు.. ఓటుకు 30 వేలు ఇచ్చి గెలవాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారు. అందుకే మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపిద్దాం.. కమల వికాసానికి పటు పడదామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నారు. ఎన్నిక ఫలితాల తర్వాతే దసరా, దీపావళి చేసుకుందాం.. అంతవరకు అన్ని పనులు పక్కనబెట్టి మునుగోడులో మకాం వేయాలని.. ఆయన టెలీ కాన్ఫరెన్స్లో నేతలతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
దేవీ నవరాత్రి ఉత్సవాల సమయంలో వచ్చిన ఎన్నికల్లో గెలుపు బీజేపీ దేనన్నారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ లో బీజేపీ కార్యకర్తలు తిండి తిప్పలు లేకుండా కష్టపడి పనిచేయడంవల్లే బీజేపీ గెలిచిందన్నారు. మునుగోడులోనూ తాడో పేడో తేల్చుకుందామని, ప్రతి కార్యకర్త..రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు..
మరిన్ని తెలంగాణ వార్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..