Bhuma Akhila Priya: 3 రోజులు.. 30 గంటలు.. 300 ప్రశ్నలు.. ఉక్కిరిబిక్కిరి అయిన భూమా అఖిల ప్రియ..!
Akhila Priya Kidnap Case: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ కస్టడీ ముగిసింది. మూడు రోజుల విచారణలో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు.
Bhuma Akhila Priya Kidnap Case: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ కస్టడీ ముగిసింది. మూడు రోజుల విచారణలో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. కాగా, మూడు రోజుల్లో 30 గంటలు విచారించిన పోలీసులు.. అఖిల ప్రియను 300 ప్రశ్నలు అడిగారు. కిడ్నాప్ సమయంలో ప్రవీణ్ రావు నివాసం దగ్గర భార్గవ్ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు ఈ విచారణలో నిర్ధారించారు. కూకట్పల్లిలోని ఓ లాడ్జిలో కిడ్నాపర్ల కోసం భార్గవ్ బస ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. ఇక బోయిన్పల్లి మార్కెట్ దగ్గర భార్గవ్ కారులో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
కిడ్నాప్ చేసిన ముగ్గురిని(నవీన్, సునీల్, ప్రవీణ్) చిలుకూరు దగ్గరలోని ఫామ్హౌస్లో నిందితులు బంధించారు. నవీన్, సునీల్తో డాక్యూమెంట్స్పై భార్గవ్ సంతకాలు పెట్టించుకున్నాడు. అయితే డాక్యుమెంట్స్పై ఆళ్లగడ్డ అని ఉండడంతో ప్రవీణ్ రావు సంతకం చేసేందుకు నిరాకరించారు. అంతలోనే కిడ్నాప్ వ్యవహారం పోలీసులకు తెలిసిందంటూ అఖిల ప్రియ భార్గవ్కు ఫోన్ చేసి చెప్పిందని పోలీసులు గుర్తించారు. అలా అఖిల ప్రియ ఫోన్ కాల్ చేయడంతో అలర్ట్ అయిన కిడ్నాపర్లు.. ముగ్గురినీ మొయినాబాద్లో వదిలేశారు.
హైదరాబాద్లోని హఫీజ్పేటలో గల 48 ఎకరాల భూ వివాదం నేపథ్యంలో నవీన్ రావు, సునీల్ రావు, ప్రవీణ్ రావు అనే వ్యక్తులను అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ అండ్ గ్యాంగ్ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. కిడ్నాప్నకు గురైన ముగ్గురు వ్యక్తులు ముఖ్యమంత్రి కేసీఆర్కు సమీప బంధువులు. కిడ్నాప్ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసును చేధించారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే కిడ్నాప్నకు అసలు సూత్రధారులు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్, వీరి అనుచరుడు గుంటూరు శ్రీను అని నిర్ధారించుకున్న పోలీసులు అఖిల ప్రియను అరెస్ట్ చేశారు. ఆమె భర్త భార్గవ్, గుంటూరు శ్రీను ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. అఖిల ప్రియను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. కిడ్నాప్ కేసులో విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. దాంతో కోర్టు అఖిల ప్రియను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది.
తృటిలో తప్పించుకున్న గుంటూరు శ్రీను..
ఇదిలాఉంటే.. పరారీలో ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్, అతని అనుచరుడు గుంటూరు శ్రీను కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లోనూ గాలింపును ముమ్మరం చేశారు. గుంటూరు శ్రీను పుణెలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను పసిగట్టిన శ్రీను అక్కడిని తప్పించుకున్నాడు.
Also read:
The Family Man2 Teaser: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ టీజర్ వచ్చేసింది.. లాస్ట్లో సామ్ ట్విస్ట్ అదిరింది..