లాక్డౌన్ ఎఫెక్ట్: ఆన్లైన్లో ఆర్టీఏ సేవలు..
కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ పంజా విసురుతోంది. లాక్డౌన్ మరింత కాలం కొనసాగించే అవకాశం ఉండడంతో రవాణా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ పంజా విసురుతోంది. లాక్డౌన్ మరింత కాలం కొనసాగించే అవకాశం ఉండడంతో రవాణా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ సేవలను ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని పొందేలా 2016లోనే ప్రారంభించారు. సుమారు 60 రకాల సేవలకు ఆన్లైన్లోనే స్లాట్ బుక్ చేసుకొని ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆర్టీఏ కార్యాలయాలను క్యాష్లెస్ గా మార్చారు. కౌంటర్లలో ఎక్కడా డబ్బులు చెల్లించకుండానే అవసరమైన సేవలు పొందేందుకు ఆన్లైన్లోనే చెల్లించేలా ఏర్పాట్లు చేశారు.
అయితే.. ఇలా ఎప్పటి నుంచో ఆన్లైన్తో అనుసంధానమైన ఆర్టీఏ సేవలను ప్రస్తుత లాక్డౌన్ సమయంలో ఆర్టీఏ కార్యాలయానికి రాకుండానే పొందేలా చేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆర్టీఏ కార్యాలయాలు తెరిచే ఉంటున్నా, ప్రజలు అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఆర్టీఏ ఉద్యోగులు మాత్రం ప్రతి రోజు విధులు నిర్వహిస్తున్నా, కొంత మేరకైనా సేవలు అందించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అటు విధుల్లోకి వచ్చే ఉద్యోగులతో ఆన్లైన్ ద్వారా ఎలాంటి సేవలు అందించవచ్చనే అంశంపై ఐటీ విభాగం అధికారులతో కసరత్తు చేస్తోంది.
భారత్ లో కోవిద్ 19 ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న మొదటి రోజుల్లో బీఎస్-4 వాహనాల శాశ్వత రిజిస్ర్టేషన్ విషయంలో ఆర్టీఏ కార్యాలయానికి రాకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఫీజులు చెల్లిస్తే పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇలా ఒక సేవకు మాత్రం చేసి ఆగిపోయారు. తాజాగా మరి కొన్ని సేవలను ఆన్లైన్లోనే సమర్థవంతంగా అందించేందుకు ఉన్న అవకాశాలను రవాణా శాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, రెన్యువల్స్, ప్రజా రవాణా వాహనాల త్రైమాసిక ఫీజులు, ఇంకా కొన్ని సేవలను ఆన్లైన్లోనే ఇంటి దగ్గర నుంచే పొందేలా సాప్ట్వేర్లో మార్పులు చేస్తే కొంతవరకైనా బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు.