తెలంగాణలో మరో రెండు రోజులు భానుడి భగభగలు
తెలంగాణలోకి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 19న తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. అయితే అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండనున్నాయి. దీంతో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావారణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ‘‘రానున్న రెండు రోజులు తెలంగాణలోని పలు ప్రదేశాల్లో ఎండల తీవ్రత పెరగనుంది. […]
తెలంగాణలోకి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 19న తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. అయితే అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండనున్నాయి. దీంతో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావారణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
‘‘రానున్న రెండు రోజులు తెలంగాణలోని పలు ప్రదేశాల్లో ఎండల తీవ్రత పెరగనుంది. వాయు తుఫాను తీవ్రత తగ్గితేనే ఇక్కడ ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి’’ అని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరక్టర్ వైకే రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఈ నెల 19 నుంచి తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇక అధికారుల అంచనా ప్రకారం అదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44డిగ్రీలకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్లో ప్రస్తుతం 37 డిగ్రీల ఉష్ణోగ్రతనే ఉన్నప్పటికీ.. అది 42 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని సమాచారం. పెరగనున్న ఎండలతో పాటు సాయంత్రం సమయాల్లో బలమైన గాలులు వీయనున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో మామూలుగా జూన్ మాసంతో 136మి.మీటర్ల వర్షపాతం పడాల్సి ఉంది. కానీ రుతుపవనాల ఆలస్యంతో సాధారణం కన్నా 30% తక్కువ వర్షపాతం నమోదు కానుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.