కార్మికులకు నెలకు రూ. 1500 ?.. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం !
కార్మికుల దుర్భర పరిస్థితిని గమనించే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.............
కరోనా, లాక్డౌన్ కారణంగా కోట్లాది జీవితాలు తలకిందులయ్యాయి. భారత్లోనూ వేగంగా విస్తరిస్తున్న వైరస్ అన్ని వ్యవస్థలను స్తంభింపజేసింది. దీంతో చిన్న ఉద్యోగులు, రెక్కాడితే గానీ, డొక్కాడని రోజు కూలీలు ఉపాధి కోల్పోయారు. మరీ ముఖ్యంగా భవననిర్మాణ కార్మికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. వీరంతా రోజు కూలీలుగానే పనిచేస్తుంటారు. పని చేసినరోజే కూలీ.. లేదంటే కొద్దోగొప్పో కూడబెట్టుకున్నదాంట్లోంచే ఆ రోజుకు ఖర్చుపెట్టుకోవాలి. రోజుల తరబడి పనిదొరకని పరిస్థితి ఏర్పడితే మాత్రం వీరు కుటుంబాలతోసహా పస్తులుండటం తప్ప వేరే దారి ఉండదు. వీరి దుర్భర పరిస్థితిని గమనించే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ. 1500 చొప్పున మూడు నెలల పాటు సాయం అందించాలని భావిస్తోంది. పేదలకు ఇచ్చే బియ్యం, నగదు సాయానికి ఇది అదనం కాగా..ఏప్రిల్ నుంచే ఈ సాయం అందించాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం..ఇందుకోసం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నిధులను వాడుకోనుంది. మార్చి 24న దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించిన తర్వాత దేశంలోని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం దృష్ట్యా కేంద్ర కార్మిక శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వాలు వసూలు చేసే కార్మిక సంక్షేమ సెస్ సొమ్మును డీబీటీ ద్వారా కార్మికుల అకౌంట్లలో వేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలో 15.40 లక్షల మంది గుర్తింపు పొందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.