సినిమా టికెట్లు కావాలా.. అయితే.. ఆన్లైన్ ఎందుకు..? ప్రభుత్వం ఉందిగా..?
గతంలో మూవీ చూడాలంటే థియేటర్కి వెళ్లి టికెట్లు కొనుక్కునేవారు. స్టార్ హీరో మూవీ వచ్చిందంటే చాలు.. సినిమా మొదలు కావడానికి రెండు, మూడు గంటల ముందునుంచే టికెట్ కోసం.. థియేటర్లో గేటు వరకు లైన్లో నించునేవారు. లైన్లో తోపులాటలు కూడా జరిగేవి. ఇక ఇంతా కష్టపడి టికెట్ సంపాదిస్తే ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఫీలయ్యేవారు. తరువాత రోజుల్లో స్మార్ట్ ఫోన్లు చేతికి రాగానే ప్రతిఒక్కరూ ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం అలవాటైపోయింది. దీంతో సినిమా టికెట్ల కోసం […]
గతంలో మూవీ చూడాలంటే థియేటర్కి వెళ్లి టికెట్లు కొనుక్కునేవారు. స్టార్ హీరో మూవీ వచ్చిందంటే చాలు.. సినిమా మొదలు కావడానికి రెండు, మూడు గంటల ముందునుంచే టికెట్ కోసం.. థియేటర్లో గేటు వరకు లైన్లో నించునేవారు. లైన్లో తోపులాటలు కూడా జరిగేవి. ఇక ఇంతా కష్టపడి టికెట్ సంపాదిస్తే ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఫీలయ్యేవారు. తరువాత రోజుల్లో స్మార్ట్ ఫోన్లు చేతికి రాగానే ప్రతిఒక్కరూ ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం అలవాటైపోయింది. దీంతో సినిమా టికెట్ల కోసం లైన్లో నిలబడటం, తోపులాటలు మాయం అయ్యాయి. తమకు అనుకూలమైన సమయంలో ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకుని సినిమాకి వెళ్లడం కామన్ అయిపోయింది. దీంతో సినిమా విడుదలైన రోజున టికెట్ కౌంటర్లు తెరవాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో సినీ అభిమానులు షాక్ తగిలినట్లైంది. ఆన్ లైన్లో టికెట్లు విక్రయించే విధానానికి స్వస్తి చెప్పబోతున్నామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వమే టికెట్లు విక్రయించే యోచనలో ఉందని ఆయన వెల్లడించారు. దీనివల్ల అందరికి లాభం చేకూరుతుందని మంత్రి తలసాని చెప్పారు.
ఈ విధానాన్ని రద్దు చేయడం వల్ల ప్రేక్షకులపై భారం తగ్గుతుందని.. నిర్మాతలకు, డిస్టిబ్యూటర్లకు లాభం చేకూరుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం బుక్ మై షో, పేటీఎం, జస్ట్ టికెట్స్, టికెట్ న్యూ వంటి ఆన్ లైన్ యాప్ల ద్వారా సినిమా టికెట్ల విక్రయం జరుగుతోంది. సినిమా విడుదలకు నాలుగైదు రోజుల ముందు నుంచే టికెట్లను తమ తమ యాప్లలో అందుబాటులో ఉంచుతున్నారు. మనకు కావాల్సిన షో టికెట్ ఇంట్లో కూర్చునే బుక్ చేసుకునే అవకాశం వీటి వల్ల కలుగుతోంది. అయితే, సినిమా టికెట్ ధరతోపాటు ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ చార్జీల పేరిట అదనంగా కొంత మొత్తం వసూలు చేస్తున్నారు. అంతేకాదు, సినిమా టికెట్తో పాటు స్నాక్స్, జ్యూస్, కూల్ డ్రింక్స్ వంటివి కూడా అంటగట్టి.. పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. సినిమా టికెట్ ధర కంటే.. అదనపు ఛార్జీలే ఎక్కువ అవుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాదు, స్టార్ హీరోల సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే టికెట్లను బ్లాక్ చేసి.. తరువాత బ్లాక్లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్ యాప్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం సినిమా టికెట్ల విక్రయాలన్నీ ఎఫ్ డీసీ అధీనంలోకి తీసుకుంటున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. బుక్ మై షో వంటి ప్రైవేటు పోర్టళ్లు సైతం ఎఫ్ డీసీ నుంచే టికెట్లు తీసుకునేందుకు వీలు కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఈ పోర్టళ్ల వారికి షాక్ తగిలినట్టైంది. తమ ఉపాధి పై దెబ్బకొడుతున్నారని వారు మండిపడుతున్నారు. ఎప్పటినుంచో అందుబాటులో ఉన్న ఈ విధానాన్ని రద్దు చేయడం కరెక్ట్ కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సినిమా టికెట్ల విక్రయం ఆన్ లైన్లో రద్దు కాబోతోంది.