ఇంకొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ టెస్టులు..రేపట్నుంచే..
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజుకు వెయ్యి చేరువలోనే పాజిటివ్ కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజూ 500 నుంచి 800 వరకు కేసులు నమోదు అవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో కోవిడ్ టెస్టులు..
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజుకు వెయ్యి చేరువలోనే పాజిటివ్ కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజూ 500 నుంచి 800 వరకు కేసులు నమోదు అవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో కోవిడ్ టెస్టులు తక్కువగా చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే అటువంటి విమర్శలన్నింటికీ చెక్ పెడుతూ..తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికను అమలు చేస్తోంది. నగరంలో పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇప్పటికే కరోనా టెస్టులకు అనుమతించగా..తాజాగా ఇంకొన్ని ఆస్పత్రులను అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు జిల్లా కేంద్రాల్లోనూ కోవిడ్ టెస్టులు నిర్వహణను పెంచేందుకు కూడా సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
నగరంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనా పేషెంట్లకు చేస్తున్న ఏర్పాట్లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి, సంతోష్ నగర్లోని ఓవైసీ ఆస్పత్రిని మంత్రి ఈటల పరిశీలించారు. రేపటి నుండి అక్కడ కరోనా పేషెంట్లకు చికిత్స అందించాలని యాజమాన్యాలను మంత్రి కోరారు. అదే విధంగా ఈ రోజు నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ను మంత్రి సందర్శించారు. అంతకుముందు అధికారులతో మంత్రి ఈటల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..కరోనా లక్షణాలు కలిగిఉన్న అవసరమైన ప్రతి వ్యక్తికీ పరీక్షలు చేయిస్తామని తెలిపారు. అందుకోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 11 కేంద్రాల్లో నమూనాల సేకరణకు ఏర్పాటు చేసినట్లు మంత్రి ఈటల స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని కింగ్కోఠి ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి నల్లకుంట, చెస్ట్ హస్పిటల్, నేచర్ క్యూర్ (అమీర్పేట), సరోజినీ దేవి కంటి ఆస్పత్రి (మెహదీపట్నం), ఆయుర్వేద ఆస్పత్రి (ఎర్రగడ్డ), హోమియోపతి ఆస్పత్రి (రామంతపూర్), ఏరియా ఆస్పత్రి (వనస్థలిపురం), నాచారం, సరూర్నగర్లోని ఈఎస్ఐ, నిజామియా టీబీ ఆస్పత్రి (చార్మినార్), ఏరియా ఆస్పత్రి (కొండాపూర్) ఆస్పత్రుల్లో పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు అక్కడికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. టెస్టుల కోసం వస్తున్న వారు తప్పని సరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. లేదంటే ఆ ఆస్పత్రులే కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు.