చెట్లే కదా అనుకున్నారు….రూ.53 వేల జరిమానా కట్టారు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకాన్ని ఓ యజ్ఞంలా తలపెట్టింది. నిర్లక్ష్గ్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఫైన్ వేస్తున్నారు...జైలు శిక్షలు కూడా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కూకట్పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీకి భారీ జరిమానా విధించారు. జరిమానా అంటే అది ఎంతో తెలుసా..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకాన్ని ఓ యజ్ఞంలా తలపెట్టింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా విరివిగా మొక్కలు నాటాలని ప్రచారం చేస్తోంది. వృక్షో రక్షతి రక్షితః అన్న నినాదంతో ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. మొక్కలు నాటే విషయంలో, రాష్ట్రంలో అడవులను పెంచే విషయంలో ఎంత శ్రద్ద తీసుకుంటున్నారో…మొక్కల పట్ల నిర్లక్షంగా వ్యవహరించిన వారిపై కూడా ప్రభుత్వం అంతే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొక్కలు ఎండిపోయినా…పశువులు తినేసినా.. వారి యజమానులకు ఫైన్ వేస్తున్నారు. అంతేకాదు..జైలు శిక్షలు కూడా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మేడ్చల్ అటవీశాఖ కూకట్పల్లి హౌజింగ్బోర్డులోని ఓ గేటెడ్ కమ్యూనిటీకి భారీ జరిమానా విధించింది.
కూకట్పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో అనుమతి లేకుండా సుమారు 40 చెట్లు నరికివేశారు నిర్వాహకులు. ఈ విషయం అటవీ శాఖ అధికారులకు తెలియడంతో మేడ్చల్ జిల్లా అటవీ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాల్టా చట్టం అతిక్రమణ కింద బాధ్యులపై రూ.53,900 జరిమానా విధించారు అటవీ అధికారులు. కొట్టిన చెట్లకు బదులుగా 80 మొక్కలు నాటి సంరక్షించాలని ఒక షరతు విధించారు. కమ్యూనిటీలో అదనపు సౌకర్యాల కల్పన కోసం చెట్లు కూల్చాల్సి వచ్చిందని, కొట్టేసిన చెట్లను ట్రాన్స్లొకేట్ చేశామని గేటెడ్ కమ్యూనిటీ నిర్వాహకులు చెప్పగా… అది శాస్త్రీయంగా జరగలేదని గుర్తించిన అధికారులు…బాధ్యులపై సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు సమాచారం.