కాంగ్రెస్ నేతల జలదీక్ష
పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేాయాలంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జల దీక్ష ఉద్రిక్తం
పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జల దీక్ష ఉద్రిక్తంగా మారింది. ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. దీక్షలకు పోలీసుల అనుమతి లేకపోవడంతో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టుల వద్దకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పలు చోట్ల పోలీసులు అడ్డుకున్నారు.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొడుకొండ్ల వద్ద జలదీక్షకు వెళ్తున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా నేతలు రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మహబూబ్నగర్లో పీసీసీ నేత హర్షవర్ధన్రెడ్డి, నాగం జనార్దన్రెడ్డి, హైదరాబాద్లో వంశీచందర్రెడ్డి, సంప్త్కుమార్, మిర్యాలగూడలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ను గృహనిర్బంధం చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై నేతలు పంపించి వేశారు.